అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీతోపాటు శాసనమండలిలోనూ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
శాసనసభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపులను సభలో చదివి వినిపించనున్నారు. ఈ సారి బడ్జెట్లో పిల్లల కోసం ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. వివిధ పథకాల ద్వారా 18 ఏండ్లలోపు పిల్లలకు రాష్ట్రం ఎంత వెచ్చిస్తుందో ఆర్థికశాఖ నివేదిక విడుదల చేయనుంది. మహిళలు, బాలికల సంక్షేమ పథకాల కేటాయింపులు ఇందులో విడివిడిగా క్రోడీకరించనుంది.
మహిళలు, బాలికల పురోగతికి దోహదపడుతున్న పథకాలపై బడ్జెట్లో ప్రస్తావించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో లాక్డౌన్, వ్యాక్సినేషన్, దవాఖానల్లో వసతులు తదితర వాటిపై సభలో చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ ఆమోదం కోసం నిర్వహించే ఈ సమావేశాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక రోజుకే పరిమితం చేయాలా.? లేక మరికొన్ని రోజులు నిర్వహించాలా అనేది శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖరారు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.