‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాల్ని నేను ఇష్టపడతాను. ఇది అలాంటి కథే. రియలిస్టిక్గా సాగుతూ అందరికీ కనెక్ట్ అవుతుంది. నాకు ఎంతో ఇష్టమైన హాస్యనటుడు అలీ నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమాలోని మూడో పాటను శుక్రవారం సమంత విడుదలచేసింది. అలీ, నరేష్, పవిత్రాలోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. మోహన్ కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘మలయాళంలో విజయవంతమైన ‘వికృతి’ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. సామాజిక మాధ్యమాల ప్రభావం సామాన్యులపై ఎలా పడుతోంది? కొందరు ఆకతాయిలు సరదా కోసం చేసిన పనివల్ల ఓ అమాయక కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నదన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సందేశం అలరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది’ అని చెప్పారు.