కోదాడ,మార్చి27 : కోదాడను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శనివారం మున్సిపాలిటీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అధిక నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లో కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే కోటా నుంచి పట్టణ ప్రగతికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ ప్రవేశ పెట్టిన బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనా.. ఆదాయం రూ. 36.79 కోట్లు కాగా, వ్యయం రూ.35.43 కోట్లు కాగా రూ.36 లక్షల మిగులుగా రూపొందించారు. సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంపటి పద్మామధుసూదన్, కమిషనర్ మల్లారెడ్డి, కౌల్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ కోరారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను పీఆర్టీయూ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ 30 శాతం ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయస్సు పెంపు వంటి తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో నాయకులు కోటయ్య, శ్రీనివాస్రావు, వెంకటేశ్వరరావు, నరేశ్, కాశీం, మధుసూదన్రెడ్డి, గోపీరెడ్డి, లింగయ్య పాల్గొన్నారు.