కీసర, ఏప్రిల్ 9 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో 136 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్తో కలిసి మంత్రి ప్రారంభించారు. కీసర మండలంలోని పలు గ్రామాల్లో కమ్యూనిటీ కింద 523 కెమెరాలు, నేను సహితం కింద 3692 సీసీ కెమెరాల ఏర్పాటుకు కీసర పోలీసులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి దశలో అంకిరెడ్డిపల్లిలో 33, కీసరలో 96 కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దాతల సహకారంతో సుమారు రూ.30 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే లక్షా 25వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, కీసర సీఐ జె.నరేందర్గౌడ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, సర్పంచులు నాయకపు మాధురీవెంకటేశ్, మోర విమలనాగరాజు, అంకిరెడ్డిపల్లి ఎంపీటీపీ పండుగ కవితాశశికాంత్, కీసర ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.