ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 5 : కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవుల్లో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడంతో వారి అభిరుచి మెరుగుపడుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల్ని వినోదాలతో కాలక్షేపం కోసం వదిలేయకుండా వారిలోని ప్రతిభను మెరుగుపర్చేలా శిక్షణ ఇవ్వాలి. పెద్ద పిల్లలైతే వారు చదివే కోర్సుకు ఉపయోగపడేలా అదనపు పరిజ్ఞానం నేర్పే చోటికి పంపాలి. క్రీడలతో పాటు జీవితంలో ఉపయోగపడే అనేక విషయాలను నేర్చుకునేలా చూడాలి.
కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం
ఆధునిక సమాజంలో విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ను ప్రత్యేకంగా నేర్చుకుని సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువత ఈ నైపుణ్యం లేక వెనుకబడిపోతున్నారు. ఒక ప్రముఖ సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలో 19శాతం యువత మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నారని తెలిపింది. సెలవుల్లో వీటిని నేర్చుకుని, సద్వినియోగం చేసుకునేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
మెదడు చురుకుగా ఉండాలంటే..
చిన్నారుల మెదడును చురుకుగా ఉంచాలంటే దానికి ఎప్పుడు ఏదో పని చెప్పాలి. అందుకే పిల్లల మెదడును చురుకుగా ఉంచే ప్రతి ప్రయత్నాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చదరంగం, సుడోకు లాంటి ఫజిల్స్ మెదడును ఉత్తేజ పరుస్తాయి. తల్లిదండ్రులు మీ పిల్లల అభిరుచిని బట్టి ఫజిల్స్తో చిన్నపాటి రీజనింగ్ నేర్పించాలి.
భాషపై పట్టు సాధించాలి
ఏ భాషలోనైనా పట్టు సాధించాలంటే దానికి సంబంధించిన పద పరిజ్ఞానం ఎంతో ముఖ్యం. పదం కోసం పరితపించే సంభాషణను చప్పగా చేస్తున్న సందర్భాలను చూస్తుంటాం. పదాలను అదే పనిగా మననం చేసుకుంటూ ఉంటే పదాల గురించి కుస్తీ పట్టే పనుండదు. మన పేరు గుర్తుకొచ్చినంత సులభంగా పదాలు గుర్తుకొస్తాయి. స్కూల్, కళాశాలలో చదువుతున్న రోజుల్లో అంత సమయం ఉండదు. కాబట్టి సెలవుల్లో పద పరిజ్ఞానంపై దృష్టి పెడితే భాషపై పట్టు సాధించడం సులభమవుతుంది.
చేతిరాత మెరుగుతో అధిక మార్కులు
పరీక్షల్లో చేతి రాత చాలా ముఖ్యం. ఏ పరీక్ష అయినా మీరు రాసే సమాధానాలను కుదిరించి, చక్కగా రాస్తే చదువడానికి ఎంతో బాగుంటుంది. దీంతో ఆయా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశముంది. చేతిరాత బాగా లేక టీచర్లతో చివాట్లు తిన్న వారంతా సెలవుల్లో మెరుగుపరిచేలా శిక్షణా తరగతులకు వెళ్లడం మంచిది. పట్టణాల్లో కాలిగ్రఫీ నిపుణులు ప్రత్యేక శిక్షణ తరగతులు పెట్టి చేతిరాతపై శిక్షణ ఇస్తుంటారు. వీటికి సంబంధించిన డీవీడీలు, పుస్తకాలు కూడా మార్కెట్లో లభిస్తాయి. రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే మీ చేతిరాతను మెరుగుపర్చుకోవచ్చు.
భాషమీద పట్టుతో భవితకు నాంది
భాషమీద పట్టు అవసరం. అది తెలుగు లేదా ఇంగ్లిష్ ఏదైనా కావచ్చు. తెలుగు మాతృభాష అయితే ఇంగ్లిష్ బతుకు భాష. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సంభాషించడానికి ఇంగ్లిష్ అవసరం. భాష వేరు కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. భాష అనేది అందులో ఒక భాగం మాత్రమే. భాష మీద పట్టులేకపోతే కమ్యూనికేషన్ కూడా దెబ్బతింటుంది. సెలవుల్లో భాషపై దృష్టి పెడితే అది జీవిత కాలమంతా మనల్ని కాపాడుతుంది.
టెక్నాలజీ సొంతం చేసుకోవాలి..
ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం లేనిదే ఏ పని జరుగడంలేదు. నేడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం. రానున్న రోజుల్లో ఉద్యోగ పరీక్షలన్నీ ఆన్లైన్లోనే జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతిఒక్కరూ కంప్యూటర్ టెక్నాలజీని నేర్చుకోవడం అవసరం. ఎంఎస్వర్డ్, ఎంఎస్ఎక్సెట్, ఎంస్ఆఫీస్, వస్తే వివిధ ఆఫీసుల్లో చిన్నాచితక ఉద్యోగాలు గ్యారంటీ. మీ సొంతం పనులకు వేరే వారిపై ఆధారపడకుండా మీరే చేసుకోవచ్చు. వేసవి సెలవుల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి.
పుస్తకాలు చదువాలి
రోజుకు గంట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగించేవి, వారి భవిష్యత్తుకు, పరిజ్ఞానానికి ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచి, అవి చదివేలా చూడాలి. ఉదాహరణకు సమయ పాలన, భావోద్వేగాల అదుపు, మైండ్ మెసేజ్ వంటి పుస్తకాలు చదివితే విద్యార్థుల్లో ఉత్తేజంతో పాటు ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
ఆటలు, వ్యాయామంపై ఏకాగ్రత తప్పనిసరి
వ్యాయామం ఫిజికల్గా ఫిట్గా ఉంచుతుంది. నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. రోజుకు గంటపాటు వ్యాయామంచేస్తే మరోపూట తప్పక ఆటలు ఆడండి. వేసవిలో కొంతమంది ప్రత్యేక శిక్షక్షులు వ్యాయామంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. వీటికి హాజరుకావడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటు ఏకాగ్రత, మెమోరీ పవర్ పెరుగుతుంది.
ప్రతిభకు పదును పెట్టుకోవడం..
చాలామంది విద్యార్థులు గణితశాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి అబాకస్తో గణితంలో వేగంగా విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. నేర్చుకునే సమయంలో ఇష్టంతో నేర్చుకోవడాన్నే ఎంజాయ్మెంట్ అని తల్లిదండ్రులు, విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలి.
ఇవీ కూడా చదవండి…
ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలి
చురుగ్గా కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు
రైతుల దశ, దిశ మార్చే సందర్భం ఇది: మంత్రి హరీశ్ రావు