మియాపూర్, ఏప్రిల్ 28 : కరోనా రెండోదశలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతోపాటు ప్రాణవాయువు అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఆక్సిజన్ పడకలు దొరకడం గగమనమవుతున్నది. ఈ నేపథ్యంలో బల్దియా చందానగర్ సర్కిల్ అధికారులు కొవిడ్ బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సర్కిల్ పరిధిలో రెండోచోట్ల ఉచిత ఆక్సిజన్ హబ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో పడకలతోపాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉంచనున్నారు. శ్వాస సమస్యతో బాధపడే వారు నేరుగా ఈ హబ్లలో ఉచితంగా సేవలు పొందవచ్చు.
కొవిడ్ బాధితులకు వీలైనంత త్వరగా సేవలందించేందుకు బల్దియా జోనల్ కమిషనర్ రవికిరణ్ ఆదేశాల మేరకు చందానగర్ సర్కిల్ అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సామాజిక సేవా బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఐకియాను సంప్రదించగా ‘ఆక్సిజన్ హబ్’ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తమ సొంత నిధులతో ఆక్సిజన్ హబ్కు కావాల్సిన యంత్రాలు ఇస్తామని చెప్పి తొలిదశలో చందానగర్ హుడా కాలనీ కమ్యూనిటీహాల్లో 10 బెడ్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఇది అందుబాటులోకి రానున్నది. మియాపూర్ డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖాన ఆవరణలో మరో 40 పడకలతోపాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. హుడా కాలనీ కమ్యూనిటీహాల్ ఆక్సిజన్ హబ్లో టెలిమెడిసిన్ సౌకర్యాన్ని కూడా ఐకియా సమకూర్చుతున్నది.
కొవిడ్ రెండోదశ ఉధృతంగా కొనసాగుతున్నది. లక్షణాలు లేకపోయినా శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆక్సిజన్ను ఉచితంగా అందించేందుకు జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్సిజన్ హబ్లను ఏర్పాటు చేస్తున్నాం. హుడా కమ్యూనిటీహాల్లో బెడ్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిద్ధం చేశాం. మియాపూర్ బస్తీ దవాఖాన ఆవరణలో మరో ఆక్సిజన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రాల్లో ఉచితంగా సేవలు పొందవచ్చు. -నందగరి సుధాంశ్, డిప్యూటీ కమిషనర్, చందానగర్ సర్కిల్
కొవిడ్ బారిన పడి హోం ఐసొలేషన్లో ఉంటూ ఆందోళన చెందుతున్న వారు రామంతాపూర్లోని ప్రభుత్వ హోమియో దవాఖానలో 100 బెడ్లతో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్కు రావాలని మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్ రావు సూచించారు. పాజిటివ్ రాగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ఆయన నగరంలో అద్దెకు ఉంటున్న వారు.. సొంతింట్లో ఉండలేక ఇబ్బంది పడుతున్న వారు ఐసొలేషన్ సెంటర్కు రావాలన్నారు. వీరికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వైద్య పరీక్షలతో పాటు అవసరమైన మందులు అందజేస్తామన్నారు. పరిస్థితి విషమించిన వారిని గాంధీ లేదా ఇతర వైద్యశాలలకు పంపుతామన్నారు. అయితే ఆక్సిజన్ అవసరం ఉన్నవారి కోసం మల్కాజిగిరి ఏరియా దవాఖానలో 10 బెడ్లు, ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్సెంటర్లో మరో 10 బెడ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.