వికారాబాద్, జూన్ 8, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సివిల్ దవాఖానలో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం బుధవారం ప్రారంభం కానున్నది. ఇక్కడ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ యంత్రాన్ని రూ.1.50 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. ఇప్పటికే పది మంది ల్యాబ్ టెక్నీషియన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్, మేనేజర్, నోడల్ అధికారులను నియమించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 పీహెచ్సీలతోపాటు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి మరో 10 పీహెచ్సీల శాంపుల్స్ ఇక్కడికి తీసుకురానున్నారు. ప్రతి రోజు 1000 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉన్నది. సగటున 57వేల పరీక్షలు 24 గంటల వ్యవధిలో చేయవచ్చు. 8 రోజులుగా ఇక్కడ డ్రై రన్ జరుగుతున్నది. 35 రకాల పరీక్షల డ్రై రన్ నిర్వహించారు.
జిల్లాలోని ఏడు ప్రాథమిక దవాఖానల నుంచి ప్రతి రోజు శాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జిల్లా ప్రజలతో పాటు మరో రెండు జిల్లాల ప్రజలకు ఇది అందుబాటులోకి రానున్నది. సీహెచ్సీ, పీహెచ్సీల్లో రక్తనమూనాలను సేకరిస్తారు. రోగుల ఫోన్కు మెసేజ్ రూపంలో రిపోర్టు వెళ్లనున్నది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఆధునిక యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆరోగ్య తెలంగాణ దిశగా వైద్య చరిత్రలో మరో ముందడుగుగా చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలో డయాగ్నొస్టిక్ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితులు, వైద్యసేవలు పలు అంశాలపై ఇటీవల ప్రగతిభవన్ నుంచి అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రోగం కంటే పరీక్షల ఖరీదే ఎక్కువవుతున్న నేపథ్యంలో డయాగ్నస్టిక్ కేంద్రం కీలకంగా పని చేయనున్నది. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డయాగ్నస్టిక్ కేంద్రంలో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. వికారాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రంలో బుధవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
వికారాబాద్ జిల్లాలోని 22 పీహెచ్సీలతోపాటు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి పీహెచ్సీ, రంగారెడ్డి జిల్లా నుంచి 9 చొప్పున ఈ డయాగ్నస్టిక్ పరిధిలోకి (పీహెచ్సీలు, సీహెచ్సీలు అన్ని కలిపి) 32 రానున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, ఆలూరు, మొయినాబాద్, షాబాద్, చందన్వెళ్లి, శంకర్పల్లి, టంగుటూర్, కొందుర్గు, మల్చల్మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. నేడు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కలెక్టర్ పౌసుమి బసు, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్రెడ్డి, డాక్టర్ ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డిలతో కలిసి ప్రారంభించనున్నారు.
24 గంటలు సేవలు..
24 గంటలు పని చేసే డయాగ్నొస్టిక్ సెంటర్లో అనారోగ్యానికి గురైన వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. రెండు నెలల కిందే ఇక్కడ ప్రారంభించాలని అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు నిత్యం 300 నుంచి 600 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తారు. సీజనల్ వ్యాధులతో అదనంగా 300 మంది వరకు వస్తుంటారు. సాధారణ రక్త పరీక్షల నుంచి సీటీ స్కాన్ వరకు ఆయా రోగులకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటు డయాగ్నొస్టిక్ కేంద్రాలకు వెళ్తున్నారు. పేద, నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే చోట పరీక్షలు చేసే రోగ నిర్ధారణ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వస్తున్న రోగులకు 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేపట్టనున్నారు.
పరీక్షలు ఇవే..
డయాగ్నస్టిక్లో 57 పరీక్షలతోపాటు కొవిడ్ పరీక్షలు సైతం చేయనున్నారు. క్లినికల్ పాథాలజీ, బయో కెమిస్ట్రీ, సెరోలజీ, మైక్రో బయోలజీ, కార్డియాలజీ, ఇతర విశ్లేషణలకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. హిమోగ్లోబిన్(హెచ్బీ), టీఎల్సీ, డీఎల్సీ, ఎంపీ(ైస్లెడ్), ఈఎస్ఆర్, పీబీఎఫ్, సీబీసీ, బ్లడ్ గ్రూప్, టీఈసీ, ప్లేట్లేట్, పీసీవీ, కూంబ్స్, ప్రోథ్రోంబిస్, స్పెర్మ్ కౌంట్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా, ఎస్జీవోటీ, ఎస్జీపీటీ, ఆల్కలైన్ ఫాస్పేట్స్, టోటల్ ప్రొటీన్, కాల్షియం, పొటాషియం, సోడియం, ట్రోపోటీన్ ఐ, అల్బుమిన్, పొటాషియం, పోడియం, ట్రోపోనిన్ టీ, ఎల్డీహెచ్, ఎస్ఎల్డీహెచ్, అమిలెస్, యూరిక్ యాసిడ్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్, వీఎల్డీఎల్, హెచ్డీఎల్, టీఎస్హెచ్, ఆర్పీఆర్, హెచ్ఐవీ, స్పూటమ్(ఏఎఫ్బీ), డెంగీ, మలేరియా, ఆర్ఏ, ఓఏఎస్ఎల్వో, సీఆర్పీ, బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, హిస్టోపాథాలజీ బయాప్సీ, బోన్మారో ఆస్పిరేషన్, యూరిన్ కంప్లీట్, యూరిన్ ప్రెగ్నెన్సీ, యూరిన్ మైక్రోస్కోపీ, ఓవీఏ అండ్ సిస్ట్, ఎక్స్రే, యూఎస్జీ, ఈసీజీ ఇలాంటి 57 రకాల పరీక్షలు ఇక్కడ జరుగనున్నాయి. డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని కలెక్టర్ పౌసుమి బసు ఇప్పటికే పలు దఫాలు పరిశీలించారు. వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొత్త అధునాతన టెస్టింగ్ పరికరాలను అమర్చి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.
ఇప్పటికే తెలంగాణ స్టేట్ డయాగ్నస్టిక్ హబ్ రాష్ట్ర నోడల్ అధికారి నందిత, డాక్టర్ ప్రసాద్ వికారాబాద్ ప్రభుత్వ దవాఖాను సందర్శించి పలు అంశాలను సూచించారు. ఈ కేంద్రంలో 57 రకాల పరీక్షలే కాకుండా.. రేడియాలజీకి సంబంధించిన సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అడ్వాన్స్ ఈసీజీ కూడా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి 3వేల ఎస్ఎఫ్టీ స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు. పాత విద్యుత్ వైర్ల స్థానంలో కొత్త వైర్లు బిగించారు. ఇటీవల డ్రై రన్ను విజయవంతంగా పూర్తి చేశారు.
32 పీహెచ్సీలు, సీహెచ్సీలు.. 57 రకాల పరీక్షలు..
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్లో 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాం. జిల్లాలోని 22 పీహెచ్సీలతోపాటుగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి పీహెచ్సీ, రంగారెడ్డి జిల్లాలో 9 పీహెచ్సీలు ఈ డయాగ్నస్టిక్ సెంటర్ పరిధిలోకి 32 రానున్నాయి. ఈ సెంటర్ల నుంచి శాంపుల్స్ సేకరిస్తాం. ఇప్పటికే వికారాబాద్, ధారూర్, రామయ్యగూడ, సిద్దులూర్, నవాబ్పేట్, చన్గోముల్, పూడూర్ పీహెచ్సీల నుంచి గడిచిన 8 రోజులుగా శాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి చోట నుంచి 20-25 శాంపుల్స్ సేకరణ జరుగుతున్నది. డయాగ్నస్టిక్ సెంటర్ను బుధవారం ప్రారంభిస్తాం.
-డాక్టర్ బెజలీల్, డీ-హబ్ ప్రోగ్రాం ఆఫీసర్, వికారాబాద్ జిల్లా