డేటింగ్ ప్రకటనలతో కాల్సెంటర్ల మోసాలు
టెలీకాలర్లకు జీతాలతోపాటు కొట్టేసిన సొమ్ముపై కమీషన్
కాల్సెంటర్లలో పశ్చిమబెంగాల్ యువతులే అధికం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పలు వెబ్సైట్లలో డేటింగ్ పేరిట ఇచ్చే ప్రకటనలు చూసి స్పందిస్తున్నారా? డేటింగ్ కోసం అమ్మాయిలను పంపిస్తామని, డేటింగ్ చేస్తామంటూ లొకాంటో, ఓఎల్ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్లలో పలు కాల్సెంటర్లు చేస్తున్న ప్రచారాలను నమ్మి ఫోన్ చేస్తున్నారా? అయితే ఇక కథ కాల్సెంటర్లలోని అమ్మాయిల చేతుల్లోకి వెళ్లిపోతుంది. తియ్యటి మాటలతో వలలో వేసుకుంటారు. కిక్కెక్కించేలా మాట్లాడుతూ ఫోన్చేసినవారికి అందమైన అమ్మాయిల ఫొటోలు పంపిస్తారు.. ‘అందమైన అమ్మాయిలు మీరున్న ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వారితో ఆడియో కాల్కు ఓ రేటు, వీడియో కాల్కు మరో రేటు’ అంటూ ఫిక్స్ చేస్తారు. రూ.లక్షల్లో నొక్కేస్తారు. ఢిల్లీ, నోయిడా, కోల్కతా, గురుగావ్ వంటి ప్రాంతాల్లో కాల్సెంటర్లు నిర్వహిస్తున్నవారే ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా ఇస్తున్నారు. కాల్సెంటర్లలో హిందీ, ఇంగ్లిష్ మాట్లాడే పశ్చిమబెంగాల్కు చెందిన యువతులను ఎక్కువగా టెలీకాలర్స్గా నియమించుకుంటున్నారు. వారికి జీతంతోపాటు బాధితులను ఎంత ఎక్కువ మోసం చేస్తే అంత కమీషన్ కూడా చెల్లిస్తున్నారు. దీంతో టెలీకాలర్స్గా పనిచేసేందుకు పశ్చిమబెంగాల్కు చెందిన యువతులు ఢిల్లీకి వరస కడుతున్నారు.
ఒక బాధితుడు.. రెండుసార్లు మోసం
మరికొందరు అమ్మాయిలైతే ఒక కాల్సెంటర్ ద్వారా మోసపోయినవారి వివరాలను లీక్ చేస్తున్నారు. వాటిని మరో కాల్సెంటర్కు విక్రయిస్తూ ఉద్యోగంతోపాటు రెట్టింపు కమీషన్ సంపాదిస్తున్నారు. హైదరాబాద్లో నివాసముండే గుజరాత్కు చెందిన ఓ వైద్యుడు ఈ కాల్సెంటర్ల నుంచి ఫోన్ చేసిన టెలీకాలర్స్ ఉచ్చులో చిక్కుకున్నాడు. చాటింగ్లు, ఫోన్లలో తియ్యటి మాటలతో టెలీకాలర్స్ రూ.41.50 లక్షలు దోచేశారు. కొంతకాలం తర్వాత అతనికి మళ్లీ ఫోన్చేసి మరో రూ.30 లక్షల వరకు మోసం చేశారు. దీనిపై పోలీసులు ఆరా తీశారు. మొదట మోసం చేసింది ఒక కాల్సెంటర్ అయితే, రెండోసారి దోచేసింది మరో కాల్సెంటర్ అని విచారణలో తేలింది. ఇక్కడ మొదటి కాల్సెంటర్లో పనిచేసే టెలీకాలర్.. బాధితుడి వివరాలతో మరో కాల్సెంటర్కు వెళ్లి అక్కడినుంచి సెకండ్ ఆపరేషన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితులను మోసం చేయడం ఒక ఎత్తైతే.. ఆ సమాచారాన్ని మరో కాల్సెంటర్కు విక్రయించి డబ్బు సంపాదించడం మరో ఎత్తని చెప్తున్నారు. వైద్యుడిని మోసంచేసిన కేసులో ఉత్తర్ప్రదేశ్కు చెందిన కౌశల్ చౌదరీ, ఉమేశ్యాదవ్ను నోయిడాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
చీటింగ్ చేస్తారు జాగ్రత్త
డేటింగ్ పేరుతో వచ్చే మెసేజ్లను చూసి మోసపోవద్దు. అమ్మాయిలు మాట్లాడగానే వాళ్ల ట్రాప్లో చిక్కుకోవద్దు. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవాలి. సైబర్ నేరాలలో మాటలు చెప్పి డబ్బు లాగేస్తుంటారు. డబ్బుల ప్రస్తావన వచ్చిందంటే అదంతా మోసమని గుర్తించండి. వాళ్ల మాటలు వినకపోతే బ్లాక్మెయిలింగ్కు కూడా దిగే అవకాశాలుంటాయి. జాగ్రత్తగా ఉండాలి.
కేవీఎం ప్రసాద్, సీసీఎస్ సైబర్క్రైమ్స్ ఏసీపీ