నిజామాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ ఏడాది వానాకాలంలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు జలకళ సంతరించుకున్నాయి. తటాకాలన్నీ నిండుగా ఉండడంతో రైతులు ధీమాగా పంటలు సాగు చేశారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో సాఫీగా యాసంగి సీజన్ సాగింది. గతేడాది కన్నా ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల మూలంగా మొదట్లో ధాన్యం సేకరణ ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీంతో అన్నదాతలు కాసింత సందిగ్ధంగా ఉండగా సీఎం కేసీఆర్ మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వరి పంట సేకరణకు పచ్చజెండా ఊపారు. ఊరూరా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతుకూ కనీస మద్దతు ధరను కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందలాది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో కోతలు మొదలయ్యాయి. వరి పంట చేతికొచ్చే సమయానికి అనుగుణంగా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నారు. సీఎం ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన పాత పద్ధతిలోనే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఉభయ జిల్లాల యంత్రాంగం సిద్ధమైంది.
భారీగా కొనుగోలు కేంద్రాలు…
యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. సాగును పండుగగా మారుస్తూ కర్షకుల కన్నీళ్లు తుడుస్తోంది. గత వానకాలంలో జోరుగా వర్షాలు కురవడంతో యాసంగిలో అంచనాకు మించి వరి సాగైంది. ఆలస్యంగా పంటలు వేసినప్పటికీ దిగుబడి అంచనాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2020 లో యాసంగి, వానకాలం సీజన్లో వచ్చిన ధాన్యం రాబడి కన్నా ఎక్కువే పంట దిగుబడులు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు మద్దతు ధర అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో యాసంగిలో కొనుగోలు కేంద్రాలను భారీగా ఏర్పా టు చేస్తున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది యాసంగిలో లాక్డౌన్ కష్టకాలంలో సాగిన కొనుగోళ్ల మాదిరిగానే భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూనే ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పిస్తూ సాఫీగా పంట సేకరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం వస్తుందని అంచనాలున్నాయి. 8 లక్షల మె ట్రిక్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 354 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాలుండగా 338 కొనుగోలు కేంద్రాలు నెలకొల్పబోతున్నారు. 10 మార్కెట్ కమిటీలు, 21 ఐకేపీ సెంటర్లు, 307 పీఏసీఎస్ ఆధ్వర్యంలో సెంటర్లు తెరవనున్నారు.
2020 యాసంగిలో రూ.1569 కోట్ల చెల్లింపులు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2020 యాసంగి సీజన్లో రైతులు తమకున్న గుంట భూమిని కూడా వ్యవసాయానికి వాడుకున్నారు. పంటలు పండించేందుకు సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులను గణనీయంగా రాబట్టారు. రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. రైతుబంధుతో పెట్టుబడులకు చేయూత చేకూరింది. ఉచితంగా 24గంటల విద్యుత్ సరఫరా, కాలువల ద్వారా పంటలకు సాగు నీరు, అందుబాటులో వ్యవసాయాధికారులు, సలహా లు, సూచనలు అందివ్వడానికి క్షణాల్లో వాలిపోయే శాస్త్రవేత్తలతో కొండంత అండ లభించింది. పంటకు మంచి గిట్టుబాటు ధర రావడం, కొనుగోలు కేంద్రాలూ విస్తారంగా ఏర్పాటు చేయడంతో అన్నదాతలకు వ్యవసాయం పండుగలా మారింది. 2020 యాసంగి కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 672 కొనుగోలు కేంద్రాల్లో 8లక్షల 56వేల 513 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందుకోసం రూ.1,569 కోట్లు వెచ్చించారు. 1,59,696 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు.
హమాలీల కొరత లేకుండా..
ధాన్యాన్ని విక్రయించేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఓ వైపు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు యం త్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు చేతికొచ్చిన పంటను ఎప్పటికప్పుడు కొనేలా అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ర్టాల కూలీలు, తమ ప్రాంతాలకు వెళ్లిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. బీహార్, చత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా హమాలీ పని చేస్తుంటారు. గతేడాది లాక్డౌన్తో హమాలీల కొరత విపరీతంగా వేధించింది. కేంద్రాలు తెరిచినా తూకం వేయ డం, లారీల్లో లోడింగ్, అన్లోడింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులే హమాలీలను ఏర్పాటు చేసుకుని తూకం వేయించి, లోడింగ్ చేసే ఏర్పాటు చేసుకోవడంతో తాత్సారం జరిగింది. ఈసారి హమాలీల కొరత లే కుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చే ధాన్యంలో 14 నుంచి 16శాతం వరకు మాత్రమే తేమ ఉండాలి. కొందరు రైతులు పంటను కోసిన వెంటనే కేంద్రానికి తీసుకు వస్తుంటారు. దాంట్లో 22 నుంచి 25 శాతం వరకు తేమ చూపిస్తోంది. దీంతో ఆరబెట్టేందుకు స్థలాలు లేకపోవడం, అనుకోకుండా చెడ గొట్టుడు వాన పడితే ఆ రైతు పరిస్థితి అగమ్యగోచరమే. నిబంధనలకు అనుగుణంగా 17శాతం తేమ మించకుండా జాగ్రత్త పడితే కనీస మద్దతు ధరను సులువుగా రైతులు పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.