ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్లి థియేటర్స్ లో సినిమా చూసేంత సినిమా లేదు. దీంతో దర్శక నిర్మాతలు తమ సినిమాలు పూర్తిగా వాయిదా వేసుకోవడం తప్ప మరేం చేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి సినిమాలు విడుదల చేస్తున్నారు. మరికొందరు మాత్రం తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారు. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం కొత్తగా ఆలోచించాడు. ఆయన లేటెస్ట్ సినిమా రాధేను అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో ఒకేసారి విడుదల చేస్తున్నాడు.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన రాధే సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. రంజాన్ సందర్భంగా మే 13న రాధే సినిమాను తీసుకొస్తున్నాడు కండలవీరుడు సల్మాన్ ఖాన్. అయితే ఈ సినిమాను థియేటర్స్తో పాటు ఒకేసారి ఓటీటీలో కూడా విడుదల చేయబోతున్నారు నిర్మాతలు. ఇది నిజంగా కొత్త పద్దతే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ వరకు వచ్చి ప్రేక్షకులు సినిమా చూడలేరు కాబట్టి మీ ఇంటికే వచ్చి మా సినిమా చూపిస్తున్నామంటూ ప్రమోషన్ చేసుకుంటున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఇక్కడే అసలు దందా మొదలైంది. ఈ సినిమాను మే 13న థియేటర్తో పాటు జీ ప్లెక్స్ లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే రాధే సినిమా చూడాలంటే అక్షరాలా 249 రూపాయలు చెల్లించాలి.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ పే పర్ వ్యూ పద్దతిలో మరీ అంత పెడితే చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి సినిమా చూడాలంటే ప్రతీ వినియోగదారుడు ₹249 చెల్లించాలి. ఆహా, హాట్ స్టార్ అయితే ఏడాది సబ్స్క్రిప్షన్ వస్తుంది. మరోవైపు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటివి కూడా ఆర్నెళ్లు చూడొచ్చు. 250 రూపాయలకు ఇప్పుడు అంత వ్యాల్యూ ఉంది. అలాంటిది ఒక్క సినిమా కోసం అంత పెడతారా.. పెట్టి చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య ఇషాన్ ఖట్టర్ నటించిన ‘కాలీ పీలీ’ సినిమాను ఇలాగే విడుదల చేశారు. ఈ సినిమాకు ₹200 సబ్స్క్రిప్షన్ పెట్టి.. విడుదల చేశారు. కనీసం 10 శాతం కలెక్షన్స్ కూడా రాలేదు అప్పుడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి సాహసమే చేస్తున్నాడు. మరి ఇప్పుడు రాధే సినిమాకు ఏమవుతుందో చూడాలిక.