నిడమనూరు, మార్చి 25: దశాబ్దాల తరబడి తాలూకా కేంద్రంగా వెలుగొందిన నిడమనూరు కాంగ్రెస్ పాలకుల వివక్ష కారణంగా తన వైభవాన్ని కోల్పోయింది. మండలంగా అవతరించినా వివక్ష కొనసాగడంతో అభివృద్ధి పడకేసింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సమస్యలపై దృష్టి సారించింది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన నాటి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య కృషితో బస్టాండు పునరుద్ధరణకు నోచుకున్నది. కోర్టు ఏర్పాటుతో కక్షిదారులు మిర్యాలగూడకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.
గత పాలకుల పాపమే…
1980వ దశకంలో పాత తాలూకాగా నిడమనూరు వెలుగొందింది. తదనంతరం మండలంగా ఏర్పడినా అభివృద్ధికి నోచుకోలేదు. నియోజకవర్గ పరిధిలో నమోదైన కేసుల్లో కక్షిదారులు దూరంలో ఉన్న మిర్యాలగూడ కోర్టుకు వ్యయ ప్రయాసల కోర్చి హాజరయ్యేవారు. కక్షిదారుల ఇబ్బందుల దృష్ట్యా కోర్టు ఏర్పాటు డిమాండ్ తెరపైకి రావడంతో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా పని చేసిన కుందూరు జానారెడ్డి సాధారణ ఎన్నికల్లో కోర్టు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా కోర్టులు మంజూరైతే.. తొలి కోర్టు నిడమనూరులో ప్రారంభిస్తామంటూ చెప్పారే తప్ప పట్టించుకోలేదు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలన్నీ సమీపంలోని హాలియాకు తరలివెళ్లడంతో నిడమనూరు కళావిహీనమైంది. ఈ నేపథ్యంలో అప్పటి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నోముల నర్సింహయ్య నిడమనూరు ప్రజల ఆకాంక్షను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషికి ఫలితంగా 2015, ఆగస్టు 16న నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభమైంది.
నోముల చొరవతో…
కోర్టు ప్రారంభం నాటికి నిడమనూరు, అనుముల, పెద్దవూర మండలాల పరిధిలోని సివిల్, క్రిమినల్ కేసులు మాత్రమే కోర్టు పరిధిలోకి రాగా త్రిపురారం పోలీస్స్టేషన్ పరిధిలోని కేసులు మిర్యాలగూడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోనే కొనసాగాయి. నోముల చొరవ కారణంగా త్రిపురారం పోలీస్స్టేషన్ను సైతం నిడమనూరు కోర్టు పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, అనుముల, నిడమనూరు, త్రిపురారం, అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 524సివిల్, 2491క్రిమినల్ మొత్తం 3015 కేసులు విచారణలో ఉన్నాయి. మరోవైపు దశాబ్దకాలానికి పైగా మూతపడిన ఆర్టీసీ బస్టాండ్ పునఃప్రారంభానికి సైతం అడుగులు పడ్డాయి. వెరసి నిత్యం వేలాదిమంది రాకతో నిడమనూరులో పలు వ్యాపారాలు జోరందుకున్నాయి.
వ్యయప్రయాసలు తగ్గినయి…
గతంలో కక్షిదారులు మిర్యాలగూడ కోర్టుకు వెళ్లాలంటే సమయంతో పాటు ఆర్థిక భారం మోయాల్సి వచ్చేది. ఇప్పుడు మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుతో వ్యయ ప్రయాసలు తగ్గినయి. నియోజకవర్గానికి కేంద్ర బిందువైన నిడమనూరులో కోర్టు ఏర్పాటుతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతున్నది. దివంగత ఎమ్మెల్యే నోముల కృషి, ప్రభుత్వం చొరవతో కోర్టు ఏర్పాటైంది.