సుజాతనగర్, ఏప్రిల్ 7 : నిన్న మొన్నటి దాకా ఊళ్లల్లో శ్మశానవాటిక లేక ఎవరైన చనిపోతే వారిని సాగనంపేందుకు అష్టకష్టాలు పడేవారు. ప్రత్యేక జాగాలున్న కొన్ని కులాల వారు ఇతరులను దూరం పెట్టేవారు. చాలా కుటుంబాల వారు చెరువు గట్టుకో, వాగుల్లోనే పూడ్చి వచ్చేవారు. ఇక వానాకాలం వచ్చిందంటే అంతటా నీళ్లు నిండి అంత్యక్రియలకు అరిగోస పడేవారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లెపల్లెన వైకుంఠధామాల నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యమో, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమో కానీ ఇప్పటి వరకు వైకుంఠధామం పూర్తి కాలేదు.
మండలంలోని నాయకులగూడెం గ్రామంలో ఇప్పటి వరకు వైకుంఠధామం పూర్తి కాలేదు. గదుల నిర్మాణమే పూర్తయింది. గ్రామంలో పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు పనులు పూర్తయినప్పటికీ వైకుంఠధామం పూర్తి కాలేదు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వైకుంఠధామం వినియోగంలోకి వస్తే గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. స్థలాల గుర్తింపు నుంచి పనులు ప్రారంభం దాకా అడుగడుగునా అలసత్వమే ప్రదర్శించారు. పర్యవేక్షణ లోపంతోనే పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం పదేపదే ఆదేశిస్తున్నా ఫలితం ఏ మాత్రం కనిపించడం లేదు.
నెలరోజుల్లో పూర్తి చేయిస్తాం..
పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు పనులు పూర్తయ్యాయి. వైకుంఠధామం నిర్మాణం మాత్రం కొంచెం ఆలస్యమైంది. వైకుంఠధామం కోసం మొదట చెరువు వద్ద స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో అంతా నీరు చేరడంతో మరోచోట స్థలాన్ని కేటాయించారు. అక్కడ కూడా ఆ స్థలం మీద కొంత మంది కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత వేరే దగ్గర స్థలం కేటాయించారు. ఇలా మూడు చోట్ల స్థలాలతో ఇబ్బందులు ఎదురై పనులు ఆలస్యమైంది. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
-కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి, నాయకులగూడెం