కుత్బుల్లాపూర్ జోన్ బృందం,జూలై 7: పట్టణ ప్రగతి కార్యక్రమంతో ప్రజాసమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల డీసీలు మంగతాయారు, రవీందర్ కుమార్లతో కలిసి ఆయా సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పలు డివిజన్లలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెన్నలగడ్డ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మొక్కలు నాటారు. అనంతరం వెన్నలగడ్డ చెరువులో డ్రైనేజీ నీరు కలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీ మంగతాయారు, నోడల్ అధికారి శ్రీనివాస్, డీజీఎం రాజేశ్, ఏఈ సురేందర్నాయక్తో పాటు స్థానికులు పాల్గొన్నారు.