‘స్నేహం, పెళ్లి, సహజీవనం అంశాలను చర్చిస్తూ సాగే చిత్రమిది. రెండు జంటల కథతో భావోద్వేగభరితంగా ఉంటుంది’ అన్నారు లక్ష్మణ్ మేనేని. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మ్యాడ్’. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతావర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టి వేణుగోపాల్రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలకానుంది ఈ సందర్భంగా లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ ‘ప్రస్తుతం వైవాహిక బంధాలన్నీ కృత్రిమంగా మారిపోయాయి. రిలేషన్షిప్ డెవలప్ అయ్యేందుకు సమయం కూడా ఇవ్వకుండానే చాలా జంటలు విడాకులు తీసుకుంటున్నారు. సోషల్మీడియా కారణంగా మనుషుల మధ్య దూరం పెరిగిందనే అంశాలను ఆవిష్కరిస్తూ ఈసినిమాను తెరకెక్కించాం. బంధాలు చిరకాలం నిలబడాలంటే ఒకరినొకరు అర్థంచేసుకునేందుకు సమయం కేటాయించాల్సిందేనని, అపార్థాలుంటే పరిష్కరించుకోవాలి కానీ గొడవలు పడి విడిపోవడం కరెక్ట్ కాదని ఈ సినిమాలో చూపిస్తున్నాం. బరువు బాధ్యతలు లేని ఇద్దరబ్బాయిలు, జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాలున్న ఇద్దరు అమ్మాయిలు మధ్య ఈ కథ సాగుతుంది. నిజజీవితంలో నేను చేసిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నా. దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రం. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు.