‘సంసిద్ధంగా ఉన్నవాడినే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడికి ప్రత్యక్ష నిదర్శనం శ్రేయాస్ శ్రీనివాస్. తెలుగు చిత్రసీమలో ఆయన ప్రస్థానం బిందువు సింధువులా విస్తరించిన వైనాన్ని గుర్తుకుతెస్తుంది. శ్రేయాస్ మీడియా స్థాపనతో ఈవెంట్ మేనేజ్మెంట్లో టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. సినీ వేడుకలు జనబాహుళ్యానికి చేరువ కావడంలో శ్రీనివాస్ కీలక భూమిక పోషించారు. మరోవైపు నిర్మాతగా తన అభిరుచిని ప్రతిబింబించే సినిమాలనుతెరకెక్కిస్తూ సత్తా చాటుతున్నారు. శ్రేయాస్ గ్రూప్ను భిన్న వేదికల్లో విస్తరిస్తూ, వేలాదిమందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని చెబుతున్నారు శ్రేయాస్ శ్రీనివాస్. ‘బతుకమ్మ’ పలకరించినప్పుడు ఆయన చెప్పిన విశేషాలివి.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం మా స్వస్థలం. పాఠశాల విద్య కల్లూరులోనే. అనంతరం డిగ్రీ చేయడానికి హైదరాబాద్కు వచ్చాను. సెకండియర్లో ఉన్నప్పుడే మిత్రులతో కలిసి ‘వీ5’ పేరుతో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించాను. హీరో ఉదయ్కిరణ్ ముఖ్య అతిథిగా మా తొలి కార్యక్రమం నిర్వహించాం. అక్కడినుంచే ఈవెంట్ నిర్వహణ రంగంపై మరింత మక్కువ ఏర్పడింది. ఇందులో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆకాంక్ష మొదలైంది. 2005లో ఫ్రేమ్స్ యాడ్ ఏజెన్సీ స్థాపించాను. బిగ్సీ మొబైల్ కంపెనీకి మొదటి యాడ్ ఫిల్మ్ చేశాం. ఆ సంస్థ వ్యాపార వృద్ధికి, బ్రాండ్ విస్తరణకు ప్లానింగ్ అందించాను. సినీతారల్ని బ్రాండ్ అంబాసిడర్స్గా కుదిర్చి సంస్థ ఎదుగుదలకు సహాయం చేశాను.
నయాట్రెండ్
నాకు బ్రాండ్ ప్రమోషన్ అంటే ఇష్టం. హోమియో వైద్యం కార్పొరేట్ హంగుల్ని సంతరించుకుంటుందని ముందే ఊహించాను. హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంస్థకు మా ఏజెన్సీద్వారా అన్ని రకాల తోడ్పాటును అందించాం. ఇన్నొవేటివ్ ప్రకటనలతో వ్యాపారవృద్ధికి చేయూతనిచ్చాం. డాక్టర్స్ని లైవ్లోకి తీసుకొచ్చి ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు అందించే కొత్త ట్రెండ్ను పరిచయం చేసింది మా సంస్థే. బ్రాండ్ ప్రమోషన్లో మా కంటూ మంచి గుర్తింపు లభించాక, సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. ఎలాంటి వ్యాపార ప్రమోషన్లోనైనా సినీతారలు ముఖ్యభూమిక పోషిస్తుంటారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈవెంట్స్ చేస్తే బాగుంటుందనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది.
‘జల్సా’తో ఈవెంట్స్లోకి..
2008లో ‘జల్సా’ చిత్రం ద్వారా మా శ్రేయాస్ గ్రూప్ ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. అప్పటివరకు ఆడియో వేడుకల్ని గ్రాండ్గా నిర్వహించడం, టీవీలద్వారా లైవ్ అందించే ట్రెండ్ పరిశ్రమలో లేదు. ‘జల్సా’తో శ్రేయాస్ మీడియా తొలిసారి దానికి శ్రీకారం చుట్టింది. నా మిత్రుడు ఎస్.కె.ఎన్ ద్వారా అల్లు శిరీష్ను కలిసి మా ఐడియా చెప్పడంతో ఆయన ‘ఓకే’ అన్నారు. అల్లు అరవింద్గారూ సహకరించడంతో ‘జల్సా’ ఆడియో ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించాం. చిత్రసీమలో ఇప్పటి వరకు 1200కు పైగా ఈవెంట్స్ చేశాం. ఉభయ తెలుగు రాష్ర్టాలతోపాటు బెంగళూరులోనూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. స్పాన్సర్స్ను తెచ్చి ఈవెంట్స్ నిర్వహణలో నిర్మాతలపై వ్యయభారాన్ని తగ్గించడంలో మా సంస్థ సఫలీకృతమైంది. ఇంత భారీ సంఖ్యలో సినీ ఈవెంట్స్ నిర్వహించిన సంస్థ ప్రపంచంలోనే మాదొక్కటేకావచ్చు. ఈ ఏడాది ‘గిన్నిస్ రికార్డ్స్’ కోసం దరఖాస్తు చేద్దామనుకుంటున్నాం.
నిర్మాతగా అరంగేట్రం
2010లో నాకు దర్శకుడు మారుతితో పరిచయమైంది. ఆయన మా యాడ్ ఫిల్మ్స్ను డైరెక్ట్ చేసేవారు. ఓ సందర్భంలో మారుతి ‘ఈ రోజుల్లో’ కథ చెప్పి, సినిమా చేద్దామని అడిగారు. స్టోరీ నన్ను బాగా ఆకట్టుకోవడంతో ‘గుడ్ సినిమా గ్రూప్’ పేరుతో నిర్మాణ సంస్థను ఆరంభించాను. డబ్బు అందుబాటులోకి వచ్చినప్పుడల్లా షూటింగ్ చేస్తూ రెండేండ్లలో సినిమా పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో ఇప్పటివరకు 10 సినిమాలు చేశాను. మా సంస్థ నిర్మించిన తాజాచిత్రం ‘క్రేజీ అంకుల్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయి.
‘అందరికీ ఉపాధి’ నా సిద్ధాంతం
‘ఈ స్థాయిలో ఈవెంట్స్ చేస్తున్నావ్. సౌండ్ అండ్ లైటింగ్ ఎక్విప్మెంట్ నువ్వే ఖరీదు చేసుకోవచ్చు కదా’ అని చాలామంది నాకు సలహా ఇచ్చేవారు. అలా చేయడం నాకిష్టం లేదు. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అధిపతిగా అందరికీ ఉపాధి దొరకాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా విశ్వసిస్తాను. ఒక వేడుక నిర్వహిస్తే దానిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలమంది ఉపాధి పొందుతారు. యాడ్ ఏజెన్సీని నడిపిన అనుభవం వల్ల నాకు మార్కెటింగ్ వ్యూహాలపై మంచి అవగాహన ఏర్పడింది. నేరుగా డబ్బు పెట్టకుండా స్పాన్సర్స్ ద్వారా మనీ జెనరేట్ చేసి, అందరికీ లాభం కలిగించాలన్నదే నా ఫిలాసఫీ.
స్టార్డమ్ ఆధారంగా..
ఈవెంట్ నిర్వహణ మొత్తం స్పాన్సర్స్మీదనే ఆధారపడి ఉంటుంది. హీరోలకున్న మార్కెట్ విలువనుబట్టి వారిని కొన్ని కేటగిరిల్లో విభజిస్తాం. స్పాన్సర్స్కూడా అందుకు అనుగుణంగానే డబ్బు చెల్లిస్తారు. ఈవెంట్లో ఉండే గ్రాండ్యూర్ హీరో రేంజ్నుబట్టి ఉంటుంది. అయితే, ఇండస్ట్రీలో ఉన్న ఓ ఇద్దరు హీరోలకు ఎలాంటి కేటగిరీలూ వర్తించవు. ఆకాశమే హద్దు అనే చందంగా వారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వారి చరిష్మానే ఈవెంట్స్కు శోభనిస్తుంది. మేము ప్రతి స్పాన్సర్తో ఏడాదిపాటు ఒప్పందం చేసుకుంటాం. దాని ప్రకారమే డబ్బు చెల్లింపులుంటాయి. వాస్తవానికి ఒక్క ఈవెంట్ అనేక ప్రమోషన్లకంటే గొప్పదని నా అభిప్రాయం. ఈవెంట్ను పర్ఫెక్ట్గా నిర్వహిస్తే అది ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, సోషల్మీడియా వరకు విస్తృతంగా చేరువవుతుంది. అందుకే, మంచి ప్రమోషన్ కావాలంటే ఈవెంట్స్పై దృష్టి పెట్టాలని నా ైక్లెంట్స్కు సలహా
ఇస్తుంటా. ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న మా పనితీరువల్ల శ్రేయాస్ గ్రూప్ అంటే హీరోలకు మంచి నమ్మకం ఏర్పడింది. సెక్యూరిటీ పరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటారనీ, ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాఫీగా నిర్వహిస్తారనే భరోసా అందరిలో
ఏర్పడింది.
రోడ్మ్యాప్ ఇస్తాను
సినీ ప్రమోషన్ విషయంలో మమ్మల్ని సంప్రదించిన నిర్మాతలకు ముందే రోడ్మ్యాప్ ఇస్తాం. విడుదలకు ముందు ఎలాంటి ప్రచార కార్యక్రమాలతో ముందుకు పోవాలో సూచిస్తాం. అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు యువతే సినిమాకు ఆయువుపట్టుగా ఉంటున్నారు. ఆరంభ వసూళ్లే సినిమా వాణిజ్య విజయాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి, ప్రమోషన్ కార్యక్రమాల్లో మా తొలి లక్ష్యంగా యువతే ఉంటుంది. హీరోలకు, వారి అభిమానులకు మధ్య ప్రమోషన్ద్వారా ఓ భావోద్వేగభరితమైన బంధాన్ని సృష్టించడంపైనే మేము ఎక్కువగా దృష్టి పెడతాం. అందుకే, గత మూడేళ్లనుంచి భారీ సినీ వేడుకలను హైదరాబాద్కు ఆవల వివిధ జిల్లాల్లో కూడా నిర్వహిస్తున్నాం. దీనివల్ల మారుమూల ప్రజలుసైతం తమ అభిమాన తారల్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం దొరుకుతుంది. వాళ్లు తారలతో మరింత ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. దీనిద్వారా సినిమాకు పదింతల ప్రమోషన్ దొరికినట్లవుతుంది.
సొంత మనిషిలా..
ఎల్.బి.స్టేడియంలో ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్ నిర్వహించాం. లక్షలమంది అభిమానులు హాజరయ్యారు. ఎన్టీఆర్ను అతిథిగా ఆహ్వానించారు. ‘అందరినీ సమన్వయ పరచుకొని ఈవెంట్ను అద్భుతంగా నిర్వహించారు. ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు’ అని ప్రోగ్రామ్ అనంతరం మహేష్బాబు నన్ను అభినందించారు. ఇండస్ట్రీలోని ప్రతి హీరోతో మాకు అనుబంధం ఉంది. దాదాపు అందరి సినిమా ఈవెంట్స్కూ పనిచేశాం. హీరోలు అందించే కాంప్లిమెంట్సే మా సంస్థకు గొప్ప ఎనర్జీనిస్తాయి. ‘అల వైకుంఠపురములో’ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్గారు స్టేజీపై నా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘జల్సా’నుంచి నాతో పరిచయం ఉందని గుర్తు చేశారు. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని త్రివిక్రమ్గారు నా గురించి అంతలా మాట్లాడటంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే వేడుకలో అల్లు అరవింద్గారు కూడా నన్ను అభినందించారు. ఇన్ని మధురానుభూతులు పంచింది కాబట్టి ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్ను నా జీవితంలో ప్రత్యేకమైందిగా భావిస్తా. కొన్ని రోజుల క్రితం కర్ణాటక హూబ్లీలో లక్షమందితో నిర్వహించిన ‘రాబర్ట్’ సినీ ఈవెంట్కూడా మా సంస్థకు మంచి గుర్తింపునిచ్చింది. శ్రేయాస్ శ్రీను అంటే పరిశ్రమలో సొంత మనిషిలా చూసుకుంటున్నారు. అందరూ మనోడే అనుకుంటారు. అంతకు మించిన అదృష్టం ఏం ఉంటుందీ?
-కళాధర్ రావు