కోల్కతా: కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా ఏకరీతి టీకా విధానాన్ని అమలు చేయాలని, మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా కేంద్రం కొత్తగా తెచ్చిన టీకా ధరల నిబంధనలను రద్దు చేయాలని సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు ఒక పిటిషన్ను శుక్రవారం దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపనున్నది.
దేశవ్యాప్తంగా 18-44 ఏండ్ల వయస్కులకు వ్యాక్సినేషన్ మూడో దశ ఈ నెల 1న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి టీకాలను నేరుగా కొనుగోలు చేయవచ్చని, ఆయా సంస్థలు 50 శాతం ఉత్పత్తిని వాటికి సరఫరా చేయవచ్చని పేర్కొంది.
దేశంలో కరోనా టీకాలు ఉత్పత్తి చేసే సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ధరలను ప్రకటించాయి. రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600గా సీరం, రాష్ట్రాలకు రూ.600, ప్రైవేట్ సంస్థలకు రూ.1,200గా భారత్ బయోటెక్ పేర్కొన్నాయి. కేంద్రానికి మాత్రం పాత ధరతోనే సరఫరా చేస్తామని వెల్లడించాయి. అయితే కేంద్రానికి, రాష్ట్రానికి టీకా ధరల్లో వ్యత్యాసంపై పలు రాష్ట్రాలు, రాజకీయ పార్టీల నుంచి విమర్శలు రావడంతో రాష్ట్రాలకు టీకా ధరను కాస్త తగ్గించాయి.