మూడోరోజూ పకడ్బందీగా లాక్డౌన్
నగరమంతా నిశ్శబ్ధ వాతావరణం
రహదారులు నిర్మానుష్యం
కొనసాగిన పోలీసు తనిఖీలు
కార్పొరేషన్, మే 14 :నగరవ్యాప్తంగా మూడోరోజూ లాక్డౌన్ పకడ్బందీగా సాగింది. సడలింపు వేళల్లో ముస్లింలు రోడ్లపైకి రావడంతో సందడి నెలకొన్నది. ఉదయం పది గంటల తర్వాత ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావడంతో నిశ్శబ్ధ వాతావరణం అలుముకున్నది. పోలీసులు ప్రధాన చౌరస్తాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిచడం కనిపించింది.
నగరంలో మూడోరోజైనా శుక్రవారం లాక్డౌన్ ప్రశాంతంగా సాగింది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. జన సంచారం లేక చౌరస్తాలు బోసిపోయి కనిపించాయి. రంజాన్ పండుగ కావడంతో సడలింపు సమయంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. మార్కెట్లు, దుకాణాలు కిటకిటలాడాయి. లాక్డౌన్ అమల్లోకి రాగానే ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. పలుచోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని పం పించి వేశారు. పలువురికి నిబంధనలపై అవగాహన కల్పించారు. నేడు సెలవు దినం కావడం తో ఉద్యోగులు ఇండ్లకే పరిమితయ్యారు. పోలీసు లు వైద్యసిబ్బంది, మెడికల్షాపుల నిర్వాహకులు, విద్యుత్ ఉద్యోగుల పాసులు, ఐడీ కార్డులను తనిఖీ చేసి పంపించారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
మరోవైపు ప్రభుత్వం కరోనా కట్టడి కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. నగరంలోని మూడు కేంద్రాల్లోనే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సి బ్బంది టీకాలు వేస్తున్నారు. ప్రస్తుతం రెండోడోస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తుండడంతో కేం ద్రాల వద్ద రద్దీ కనిపించడం లేదు. ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అటు పోలీసులు, ఇటు వైద్య సిబ్బంది చ ర్యలు తీసుకుంటున్నారు. అలాగే నగరంలో ఇంటింటికీ జర్వ సర్వే కూడా వేగంగా సాగుతున్నది. ప్రతి డివిజన్లో రెండు బృందాల చొప్పున ఏర్పాటు చేసి వేగంగా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అనుమానితులకు ఐసోలేషన్ కిట్లు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.