ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడికల్ కథాంశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఓ ప్రైవేటు స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో ఎన్టీఆర్, రామ్చరణ్తో పాటు ప్రధాన తారాగణంపై ప్రమోషనల్ సాంగ్ను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా సెట్స్లో బుధవారం అలియాభట్ అడుగుపెట్టింది. షూటింగ్ కోసం మేకప్ రూమ్లో సిద్ధమవుతోన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ‘రైజ్ అండ్ షైన్’ అనే వ్యాఖ్యను జోడించింది. హీరోహీరోయిన్లతో పాటు ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ ఈ గీతంలో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ వారాంతం వరకు ఈ పాట చిత్రీకరణ సాగుతుందని సమాచారం. తాజా షెడ్యూల్ అనంతరం కథానాయకుల పరిచయం గీతం కోసం ఈ నెలాఖరున ఎన్టీఆర్, రామ్చరణ్ జార్జియాకు పయనం కానున్నట్లు తెలిసింది. తొలితరం స్వాతంత్య్రసమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాలకు ఫిక్షనల్ అంశాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకురానున్నది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.