శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఊరట లభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు సమన్లు జారీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యక్తిగత హాజరుపై పట్టుబట్టబోమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ నెల 15న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ ఇటీవల ముఫ్తీకి సమన్లు జారీ చేసింది. దీనిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని 50వ సెక్షన్ కింద సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేశారు. తనకు ఎందుకు సమన్లు చేశారు, నిందితురాలిగానా లేదా సాక్షిగానా అన్నది ఆ నోటీసులో పేర్కొనలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ చట్టంలోని సెక్షన్ 50 రాజ్యాంగబద్ధతపై స్పష్టత వచ్చే వరకు తనకు జారీ చేసిన సమన్లపై తాత్కాలికంగా స్టే విధించాలని కోర్టును కోరారు.
ముఫ్తీ పిటిషన్పై బుధవారం విచారణ జరిగిన ఢిల్లీ హైకోర్టు దీనిపై ఈడీ వివరణ కోరింది. ఈడీ తరఫున కోర్టుకు హాజరైన కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అమిత్ మహాజన్ కోర్టును కొంత సమయం కోరారు. ఈ నెల 19 వరకు ముఫ్తీ వ్యక్తిగత హాజరుపై పట్టుబట్టబోమని తెలిపారు. దీంతో న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్, అనుప్ జె భంభానీలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.