ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల సరిహద్దులో పెద్దపులుల సురక్షిత సంచారం కోసం నాలుగు నుంచి ఆరు పర్యావరణ వంతెనలు (ఎకో-బ్రిడ్జీలు) ఏర్పాటుకానున్నాయి. మంచిర్యాల నుంచి చంద్రాపూర్కు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై ఎకో బ్రిడ్జీలు, అండర్పాస్లను నిర్మించనున్నారు. ఇందుకయ్యే ఖర్చును భరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆమోదం తెలిపింది. మంచిర్యాల రెబ్బన రేంజ్, ఆసిఫాబాద్ రేంజ్లో ఎకో-బ్రిడ్జీల నిర్మాణానికి రాష్ట్ర అటవీశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో 363 జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. దీని కారణంగా చంద్రాపూర్లోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్) నుంచి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)కు మధ్య సంచరించే పెద్దపులులకు ప్రమాదం ఉంటుందని, వాటి కదలికలకు ఆటంకం ఏర్పడుతుందని తెలంగాణ అటవీశాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైవే అథారిటీకి లేఖ పంపింది. దీంతో వంతెన నిర్మించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ హైవే అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర పెంచ్ పెద్దపులుల అభయారణ్యంలో మాదిరిగా ఎకో -బ్రిడ్జీలను నిర్మించనున్నట్టు తెలిసింది. పెద్దపులులు తడోబా అంధేరి అభయారణ్యం నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మార్గంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ వరకు వలస వస్తుంటాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్, కాగజ్నగర్ ప్రాంతంలో దాదాపు పది పులులు సంచరిస్తున్నాయి. కొన్ని కవ్వాల్లో స్థిరపడుతుండగా, మరికొన్ని తిరిగి తడోబాకు వెళ్తున్నాయి. ఆయా చోట్ల ఎకో-బ్రిడ్జీల కోసం మొదట కాంక్రీట్ వంతెనలను నిర్మించి, వాటిపై మట్టిపోసి అడవులను తలపించేలా వాతావరణాన్ని సృష్టిస్తారు. వంతెనలకు ఇరువైపులా మొక్కలు నాటుతారు. దీనివల్ల పెద్దపులులు, ఇతర వన్యప్రాణులు బెదిరిపోకుండా అటు ఇటు తిరగడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో ఎకో-బ్రిడ్జి దాదాపు 60 మీటర్ల వెడల్పు ఉంటుందని చెప్పారు. త్వరలోనే నేషనల్ హైవే అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధికారులు వంతెనల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు.