అంబులెన్స్, ఇతర సదుపాయాలు
శవాలకు దహన సంస్కారాలు
పీపీఈ కిట్లు సరఫరా
ఆదిలాబాద్, మే 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సమయంలోనూ ఆదిలాబాద్ బల్దియా బాధితులకు అండగా నిలుస్తున్నది. వైరస్తో ఇబ్బందులు పడుతున్న వారిని ఉచితంగా దవాఖానకు తరలించడం, తగ్గిన తర్వాత ఇంటివద్ద దిగబెట్టడం కోసం అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు కొవిడ్తో మరణించిన వారి దహన సంస్కారాల కోసం గ్యాస్ ఆధారిత యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర సమయంలో అంత్యక్రియలకు కట్టెలను అందిస్తున్నారు. కష్టకాలంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో బాధితుల సంఖ్య పెరుగుతున్నది. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో కొవిడ్ సోకిన వారికి వైద్యశాఖ అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో పాజిటివ్ కేసులకు వైద్యం అందిస్తున్నారు. కరోనా సోకిన వారు చాలా మంది హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స పొందుతుండగా, మరికొందరు రిమ్స్, ప్రైవేట్ దవాఖానల్లో చేరుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సర్కారు, ప్రైవేట్ దవాఖానలకు పోవాలనుకునే వారికి 108 అంబులెన్స్ల సేవలు అందుబాటులో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు వీటిని వినియోగించుకోవడంలో కొంత జాప్యం జరుగుతున్నది. ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో కొవిడ్ చికిత్సల కోసం రిమ్స్ దవాఖానలకు వెళ్లాలకునే పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైన వారు 95150 60231 ఫోన్ ద్వారా అంబులెన్స్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. కొవిడ్ బాధితులను ఉచితంగా ఇంటి నుంచి దవాఖానకు, తగ్గిన తర్వాత వారిని ఇంటివద్ద దిగబెడుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్తో చనిపోయిన వారికి అంబులెన్స్ సేవలను వినియోగించుకోవచ్చు.
శవాలకు అంత్యక్రియలు
రిమ్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కరోనా బాధితులతోపాటు మహారాష్ట్రకు చెందిన వారికి చికిత్స అందిస్తారు. ఆస్పత్రికి తీసుకురావడంలో జాప్యం, ఇతర వ్యాధుల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాలకు, మహారాష్ట్రకు తీసుకుపోగా స్థానికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్యాస్ ఆధారిత యం త్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు మున్సిపాలిటీలో ఉచితంగా కట్టెలను కూడా సరఫరా చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు దహన సంస్కరాలకు హాజరుకావాలనుకుంటే ఇద్దరికి పీపీఈ కిట్లను మున్సిపాలిటీ ద్వారా అందిస్తున్నారు. కొన్ని రోజులుగా మున్సిపల్ ఆధ్వర్యంలో శవాలకు దహన సంస్కరాలు నిర్వహిస్తుండగా పది మంది సిబ్బంది సేవలో పాల్గొంటున్నారు. కష్టకాలంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అందుతున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు.