వాషింగ్టన్ : చంద్రుడిపైకి వెళ్లిన అపోలో -11 వ్యోమనౌక ఆస్ట్రోనాట్ మైఖేల్ కొలిన్స్ (90) బుధవారం కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. 1969లో చంద్రుడిపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన అపూర్వ ఘట్టంలో కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు. అపోలో మిషన్లో ప్రయాణించిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్.. లూనార్ ల్యాండర్ ద్వారా చందమామపై పాదం మోపిన విషయం తెలిసిందే. మిషన్లో ఆయన చంద్రుడిపై కాలు మోపకపోయినా.. ఆ సమయంలో మైఖేల్ చందమామ ఉపరితలానికి 69 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో-11 కమాండ్ మాడ్యూల్ అయిన కొలంబియాలో ఉన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ తిరిగి కక్ష్యలోకి చేరుకున్న తర్వాత వారి స్పేస్ క్రాప్ట్ను తానున్న స్పేస్ క్రాప్ట్తో అనుసంధానించి, క్షేమంగా భూమి మీదకు తీకురావడంలో కీలకపాత్ర పోషించారు.
మైఖేల్ 1930లో ఇటలీలో జన్మించారు. వెస్ట్ పాయింట్లోని యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ నుంచి పట్టా పొందారు. 1958-1963 వరకు కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ వైమానిక దళ స్థావరంలో పని చేశారు. 1963లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆయన మొదటిసారిగా జూలై 18, 1966 జెమిని-10లో మూడు రోజుల మిషన్లో పాల్గొన్నారు. అమెరికా చరిత్రలో స్పేస్ వాక్ చేసిన మూడో వ్యక్తి మైఖేల్. ఆయన తన రెండో మిషన్ అపోలో-11లో చంద్రుడి కక్షలోకి వెళ్లి వచ్చారు. అయితే చంద్రుడిపై పాదం మోపే అవకాశం తనకు రానందుకు ఎన్నడూ తాను బాధపడలేదని, చంద్రగ్రహంపైకి మానవుడి యాత్రను విజయవంతం చేయడంలో తాను నిర్వహించిన పాత్ర తనకు సంపూర్ణమైన సంతృప్తినిచ్చిందని 1974లో ప్రచురితమైన తన ఆత్మకథ ‘క్యారియింగ్ ద ఫైర్’లో మైఖేల్ కొలిన్స్ పేర్కొన్నారు. కొలిన్స్ 1970 నాసాలో పదవీ విరమణ చేసిన అనంతరం నేషనల్ అండ్ స్పేస్ మ్యూజియం డైరెక్టర్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అండర్ సెక్రెటరీగా పని చేశారు.