హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు ఇళ్ల పత్రాలు అందజేయనున్నారు. పీవీ మార్గ్లోని అంబేద్కర్ నగర్లో నిర్మించిన 330 ఇళ్లను అదేవిధంగా జీవైఆర్ కాంపౌండ్లో 180, పొట్టి శ్రీరాములునగర్లో 162, గొల్ల కుర్మయ్య కాలనీలో 10 ఇళ్లను మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. నిర్మాణం పూర్తైన మరొకొన్ని చోట్ల దశలవారీగా లబ్దిదారులకు ఇళ్లు అందజేయనున్నారు.
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను విడతల వారీగా లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ అందజేస్తున్నది. ఇప్పటికే 12 చోట్ల 2478 ఇండ్లను ప్రారంభించగా, తాజాగా మరో ఆరు చోట్ల 1273 ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నది.