వరంగల్: టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అసువులుబాసిన అమరులకు జోహార్లు అర్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి వరంగల్లోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ సారధిగా కేసీఆర్ నాడు ఏ లక్ష్యం కోసమైతే పోరాడారో.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ ఆశయ సాధనలో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పారు.
13 ఏండ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వు చూడాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రస్తుతం అవి లక్ష్యసాధన దిశగా పయణిస్తున్నాయని వెల్లడించారు. ఇంతగొప్ప సందర్భాన్ని అత్యంత ఉత్సాహంగా చేసుకోవాల్సి ఉండగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
అంతకుముందు తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..