8 ఏండ్లుగా నెలకు రూ.70వేలు స్వాహా
ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్ట్
నకిలీ ఫింగర్ ప్రింట్స్తో బయోమెట్రిక్ కండ్లుగప్పి 8 ఏండ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్న జీహెచ్ఎంసీలోని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి కథనం ప్రకారం.. భవానీనగర్కు చెందిన మహ్మద్ హజీ అహ్మద్ అలియాస్ అలీ, మొఘల్పురాకు చెందిన మహ్మ ద్ లాయక్ జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లుగా 15 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికుల వద్ద నుంచి వీరిద్దరు ప్రతి రోజు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు సేకరిస్తూ అటెండెన్స్ తీసుకుంటారు. ఈ అటెండెన్స్ ప్రకారం నెలవారీగా కార్మికులకు జీతాలు పంపిణీ అవుతుంటాయి.
ఈ నేపథ్యంలోనే హజీ తన గ్రూప్లో ఇద్దరిని, లాయక్ తన గ్రూప్ లో ముగ్గురిని పారిశుధ్య కార్మికురాలుగా తమ కుటుం బ సభ్యుల పేర్లను చేర్పించారు. వాళ్లు ఎప్పుడు పనిచేసేందుకు రారు. ఈ ఐదుగురికి సంబంధించిన నకిలీ వేలిముద్రలు తయారు చేశారు. వాటితో ప్రతిరోజు పనులకు వస్తున్నట్లు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. 8 ఏండ్లుగా ఒక్కొక్కరికి సంబంధించి రూ.14 వేల జీతం, మొత్తం నెలకు రూ.70 వేలు తీసుకుంటూ జీహెచ్ఎంసీని మోసం చేస్తున్నారు. ఈ నకిలీ వ్యవహారంపై సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందానికి సమాచారం రావడంతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి 5 నకిలీ ఫింగర్ ప్రింట్స్, రెండు బయోమెట్రిక్ డివైస్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు.