నల్లగొండ : ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని.. పవర్లో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేదు ఇప్పుడేం చేస్తారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం పేరూరు గ్రామంలో మహమూద్ అలీ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హోంమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల కోసం 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైతు బంధు అమలు చేసిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నారు.
రాష్ట్రంలోనే సాగర్ నియోజకవర్గ అభివృద్ధి వరస్ట్ గా ఉందన్నారు. కాంగ్రెస్కి ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లే అన్నారు. మైనారిటీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. మైనార్టీల అభ్యున్నతి, వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాలు బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ పాలనతో ముస్లింలకు గౌరవం పెరిగిందన్నారు. ముస్లిం మైనార్టీల పిల్లలు చదువుకునేందుకు ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. 210 పైచిలుకు పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో 91 వేల మంది మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మైనారిటీ విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనారిటీ రాష్త్ర నాయకులు ఇంతియాజ్, నాగరాజు (పేరూరు సర్పంచ్), రాంబాబు, అబ్బాస్, మకీత్ చందా, హలీం, వెంకట్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గోన్నారు.