‘దేవుడితో పాటు అభిమానుల ఆశీస్సులతో సాయితేజ్ తొందరగా కోలుకున్నాడు. త్వరలో మనందరి మధ్యకు వస్తాడు’ అని అన్నారు అగ్రహీరో చిరంజీవి. ‘రిపబ్లిక్’ చిత్ర ట్రైలర్ను బుధవారం ఆయన విడుదలచేశారు. సాయితేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి దేవ కట్టా దర్శకుడు.జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ట్రైలర్ను విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ‘యువ కలెక్టర్గా రౌడీయిజాన్ని అరికట్టడానికి సాయితేజ్ ప్రయత్నించే సన్నివేశాలు ట్రైలర్లో ఆసక్తిని పంచుతున్నాయి. ఎలాంటి రాజకీయ వ్యవస్థను ఎన్నుకోవాలో ప్రజలకు తెలియజెప్పే సందేశాత్మక చిత్రమిది. ప్రజల్లో ఆలోచనను రేకెత్తించే ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలి’ అని తెలిపారు. ‘రాజకీయ నాయకులకు కొమ్ముకాచే రౌడీలకు, నిజాయితీపరుడైన యువ కలెక్టర్కు మధ్య సాగే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. తన పోరులో అతడు ఎలా విజయం సాధించాడన్నది ఉత్కంఠను పంచుతుంది. అక్టోబర్ 1న విడుదలచేయనున్నాం’ అని నిర్మాతలు చెప్పారు. ఐశ్వర్యరాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.