మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ఓకే చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. చివరిగా సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించిన సాయి ధరమ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులు కూడా సగం పూర్తయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ వలన సినిమాలకు సంబంధించిన పనులన్నీ ఆగిపోగా, ఇప్పుడు తిరిగి వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి ఇంటి నుండి బయటకు వచ్చారు. శరవేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతుండగా,వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతి బాబు, ఐశ్వర్యా రాజేశ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.