‘ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ.. సిద్ధిరస్తు’- అని పురోహితులు ఆశీర్వదించడం సర్వసామాన్యం. పురుషార్థాలు అంటే.. ‘స్త్రీ పురుషులతోసహా ప్రతి మనిషీ జీవితంలో సాధించుకోవలసినవి’ అని! అవినీతి, లంచగొండితనం వంటి జాడ్యాలు సర్వత్రా బాగా పెరిగిపోతూనే ఉన్నాయి. అక్కడక్కడ చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు సేకరించి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయటం, బ్యాంక్కు కోట్లాది రూపాయలు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేయడం వంటివి సహజమవుతున్నాయి. సైబర్ నేరాలు సరేసరి. వీటన్నిటితో సమాజం అశాంతిమయంగా అభద్రతకు నిలయంగా తయారవుతున్నదంటే కారణం ‘ధర్మనిష్ఠ’ ప్రజలలో లోపించడమే. చాలామంది ధనం సంపాదిస్తూ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. ఇదే బాధాకరం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే॥ (4.8)
‘సాధుజనులను రక్షించడం కోసం, దుర్మార్గులను శిక్షించటం కోసం ధర్మాన్ని సంస్థాపించడం కోసం ప్రతి యుగంలోను నేను అవతరిస్తూనే ఉంటాను’ అని ఈ శ్లోక భావం. ప్రపంచానికే ప్రామాణిక గ్రంథమనదగిన ‘శ్రీమద్భగవద్గీత’.. ‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే..’ అంటూ ‘ధర్మ’ శబ్దంతో సమారంభం అయింది. ‘రామో విగ్రహవాన్ ధర్మః.. రాముడు రూపుదాల్చిన ధర్మం’. పైగా రాముడు ధర్మమార్గంలో ఎలా రాజ్యాన్ని పరిపాలించాలో వాచికంగానే కాక ఆచరణాత్మకంగానూ నిరూపించాడు. ధర్మాన్ని గురించి ప్రస్తుతం మరీ లోతుగా వెళ్లనవసరం లేదు. ఉదాహరణకు ‘మాతృవత్ పరదాంశ్చ పరద్రవ్యాని లోష్టవత్’. ‘ఇతరుల భార్యలను తల్లులుగా, ఇతరుల ధనాన్ని మట్టిబెడ్డలుగా భావించాలి’ అని నీతిశాస్త్ర సూక్తి. ఇది ప్రతి మనిషి ప్రాథమిక ధర్మం. రావణుడు ఈ ప్రాథమిక నీతిరేఖను సైతం అతిక్రమించాడు. కనుకే అంతటి గొప్పవాడై వుండికూడా సర్వనాశనం కావలసి వచ్చింది. రాముడు అతనిని శిక్షించవలసి వచ్చింది.
ఇక్కడో విషయం గమనించాలి. ధర్మాన్ని స్థాపించడం కోసమే భగవంతుని అవతారాలు భూమిమీద వెలిశాయి. భారతీయ జీవన విధానంలో యుగయుగాలుగా అనేక సందర్భాలలో ‘ధర్మాని’కే ప్రప్రథమ స్థానమిచ్చారు. ఆ తర్వాతే ‘అర్థం’. ఈనాటి సామాజిక అస్తవ్యస్త పరిస్థితికి మూలకారణం ప్రజలు ధర్మాన్ని గాలికి వదిలేసి, ధనం వెంటపడుతుండటం. ఏదేమైనా సరే, డబ్బు దండుకోవడానికి తెగపడటం. దీనికి సరైన పరిష్కార మార్గం ప్రతి ఒక్కరూ సామాజిక నియమాలకు తలొగ్గి జీవించడమే. మరొకరి హక్కులకు భంగం కలిగించకూడదు. ఈ రకమైన కనీస ధర్మభావన పసితనంలోనే ప్రతి ఒక్కరి మనసులో స్థిరపడాలి. ఇందుకు తల్లిదండ్రులు, గురువులే ప్రథమ బాధ్యత తీసుకోవాలి. యుక్తవయసులో, ధనార్జన అవసరం ఏర్పడేలోగానే, ఉద్యోగ వృత్తులలో స్థిరపడే మార్గాలను అన్వేషించుకొనే క్రమంలోనే ఈ ధార్మిక వ్యకిత్వ పునాది పడాలి. ఆడంబరమైన, విలాసవంతమైన జీవనశైలి అలవాటు పడే లోగానే పిల్లల్లో ఈ సద్గుణం నెలకొనాలి.
‘ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనలను సంరక్షిస్తుంది’. కనుక, ఈతరం వారికి కనీసం గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలోనైనా ప్రగాఢమైన ధర్మనిష్ఠను స్థిరపడేలా బాధ్యతగల వారంతా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే ‘గుణాత్మక పౌరులు’ తయారు కాగలరు. ఇది చిన్నతనంలో స్కూలు స్థాయిలో జరగాలి. అలా జరగనప్పుడు కనీసం ఉన్నత విద్య చివరి సంవత్సరంలోనైనా ‘ధార్మిక జీవన ఆవశ్యకత’ను యువతరానికి బోధపరచగలగాలి. ఈ మేరకు సంబంధిత సిలబస్లలోనే మార్పులు అవసరం. ఈ క్రమంలో మరోవైపు సమాజంలో తలెత్తుతున్న ఆర్థిక దుష్పరిణామాలకు ఆయా ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతను గుర్తెరిగితే బావుంటుంది.
-డాక్టర్ వెలుదండ సత్యనారాయణ , 94411 62863