అలియాభట్ టైటిల్ రోల్లో సంజయ్లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. వేశ్య వృత్తి నుంచి ముంబయి మహిళాడాన్గా ఎదిగిన గంగూబాయి కతియావాడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఆదివారం ముంబయిలో పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కథానాయిక అలియాభట్ భావోద్వేగానికి గురైంది. గత రెండేళ్ల నుంచి లాక్డౌన్లు, ముంబయిలో సంభవించిన వరదల వల్ల షూటింగ్ అనేక అవాంతరాలతో సాగిందని..ఎట్టకేలకు గొప్ప సినిమాను తీశామనే సంతృప్తి అందరిలో మిగిలిందని అలియాభట్ పేర్కొంది. సంజయ్లీలాభన్సాలీ వంటి దిగ్దర్శకుడి చిత్రంలో తొలిసారి నటించడం ఓ జీవితాకాల అనుభవమని కొనియాడింది. ఈ సినిమా ద్వారా నటిగా తనలో మరింత పరిణితి లభించిందని, షూటింగ్ పూర్తికావడంతో ఏదో కోల్పోయినట్లు అనిపించిందని అలియాభట్ ఉద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్లో ఓ సుదీర్ఘ నోట్ను పోస్ట్ చేసింది. ‘నా జీవితాన్ని మార్చివేసిన ఎన్నో అనుభవాల్ని ఈ సినిమా అందించింది. సంజయ్లీలాభన్సాలీ దర్శకత్వంలో నటించడంతో నా చిరకాల స్వప్నం నెరవేరినట్లయింది. ఈ ప్రయాణాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకుంటా. ఓ సరికొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న మహిళగా నేను ఈ సినిమా యూనిట్కు వీడ్కోలు పలికాను. షూటింగ్ అనుభవాల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే నాలో ఓ భాగాన్ని వదిలిపోతున్నాననే భావనతో హృదయం భారమైంది. మీతో సాగించిన ఈ రెండేళ్ల ప్రయాణాన్ని సదా స్మరించుకుంటా’ అని అలియాభట్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ నోట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది.