కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో రూపొందిన దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్స్’ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రెజీనా, నివేథా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్వర్మ దర్శకుడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. ‘సార్వజనీన భావన కలిగిన కథాంశమిది. తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. మన నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశాం. పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు యువతులు ఓ రాత్రిలో జరిగిన కిడ్నాప్ను ఎలా ఛేదించారు? ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. ఈ సినిమా కోసం నివేదా థామస్, రెజీనా యాక్షన్ ఘట్టాల్లో శిక్షణ తీసుకున్నారు. ఆగస్ట్ నెలలో చిత్రీకరణ పూర్తిచేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిచర్డ్ప్రసాద్, సంగీతం: మైకీ మెక్లేరే, నిర్మాతలు: డి.సురేష్బాబు, సునీత తాటి, హ్యున్యూ థామస్ కిమ్, దర్శకుడు: సుధీర్వర్మ.