శాలిగౌరారం, ఏప్రిల్ 28 : దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించి నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా శాలిగౌరారం మండలం గురజాల-మానాయికుంట గ్రామాల మధ్యన ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మండల ప్రజలు మానాయికుంట, తిరుమలగిరి, తుంగతుర్తి, అడ్డగూడూరు తదితర గ్రామాలకు వెళ్లాలంటే గురజాల-మానాయికుంట గ్రామాల మధ్యన ఉన్న మూసీ ఏటి లోంచి నీళ్లగుండా వెళ్లాల్సి వచ్చేది. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. ఏరు దాటి అవతల గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సమస్యను కళ్లారా చూసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పం పారు. దీంతో ప్రభుత్వం 2017లో బ్రిడ్జినిర్మాణానికి రూ.18 కోట్లు నిధులను మంజూరు చేసి పనులను ప్రారంభించింది. పనులను అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి.
తగ్గనున్న 30 కిలోమీటర్ల దూరం
వర్ష్షాకాలంలో మూసీ ప్రవహిస్తున్న క్రమంలో నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి, తిరుమల గిరికి వెళ్లాలంటే ప్రజలు నకిరేకల్, సూర్యాపేట, అర్వపల్లి మండలాల మీదుగా సుమారు 30 కిలోమీటర్లు అదనంగా దూరం ప్రయాణం చేసి చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతుండడంతో మూసీలో మట్టి రోడ్డు వేసి రాకపోకలు సాగిస్తున్నారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నల్లగొండ జిల్లాలను కలిపి సుమారు 10 గ్రామాలకు చేర వేసే బ్రిడ్జి నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 20 పిల్లర్లకు సుమారు 18 పిల్లర్లు పూర్తయ్యాయి. వీటి మీద గడ్డర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.