సైబరాబాద్ పరిధిలో ప్రజలను ఆర్థిక మోసాల నుంచి కాపాడేందుకు సీపీ సజ్జనార్ ప్రతి ఠాణాలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం డెస్క్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఫిర్యాదు అందగానే బాధితుల ఖాతాల నుంచి బదిలీ అయిన నగదును బ్యాంకుల్లోనే ఫ్రీజ్ చేస్తుండటంతో కొంత ఊరట లభిస్తున్నది. సుమారు 37 పోలీస్స్టేషన్లలో ఏర్పాటైన ఈ డెస్క్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్ పరిధిలో సైబర్ క్రైం ఫిర్యాదులను ఎప్పటికప్పుడు డీసీపీలు పర్యవేక్షిస్తున్నారు.
ఇంట్లో టైంపాస్ కోసమని..గూగుల్ సెర్చ్ చేస్తూ.. కొన్ని ప్రకటనలకు ఆకర్శితులై.. సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ముఖ్యంగా ఓఎల్ఎక్స్లో వాహనాల అమ్మకాలు, ఇతర ప్రకటలను చూసి.. నిందితుల వలలో పడుతున్నారు. సైబర్నేరగాళ్లు డబ్బుల చెల్లింపులకు క్యూఆర్ కోడ్ను పంపించి.. ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఆర్మీ దుస్తుల్లో ఫొటోలు పెట్టి.. మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులను అతి తక్కువ ధరకు విక్రయిస్తామని, అడ్వాన్సు చెల్లించుకొని.. మోసం చేస్తున్నారు. ప్రతి ఠాణాకు వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తే అత్యధికంగా మహిళలు, యువకులే బాధితులవుతున్నారు.
సూపర్ లైక్ యాప్ అప్లికేషన్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. అడ్వాన్సుగా తమ దగ్గర కొంత డబ్బును డిపాజిట్ చేయమని చెప్పి.. తాము ఇచ్చే టాస్క్ను పూర్తి చేస్తే.. మీరు పెట్టిన పెట్టుబడికి 100 శాతం తిరిగి లాభాలు వస్తాయని నమ్మిస్తారు. ఈ యాప్ వల్ల ఓ మహిళ ఆరు లక్షలు పోగొట్టుకున్నది.
మా జోన్ పరిధిలో సుమారు తొమ్మిది పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైం డెస్కులను ఏర్పాటు చేశాం. ప్రతి రోజు ఎనిమిది ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఎక్కువ మంది మహిళలు, యువతే అధికంగా మోసపోతున్నారు. ప్రతి ఫిర్యాదు పై వెంటనే స్పందిస్తున్నాం. మాకు అందుబాటులో ఉన్న వరకు ముందుగా బాధితుల ఖాతా నుంచి ఆగంతకుల అకౌంట్కు బదిలీ అయిన నగదును ఫ్రీజ్ చేసే ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నాం. ఇలా బాధితుల నగదు పోకుండా కొంత మేరకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఓటీపీ, పిన్, సీవీవీ నంబర్లను గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పవద్దు. -పద్మజారెడ్డి, డీసీపీ బాలానగర్