ప్రకృతి అందాలకు నెలవైన కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో పుట్టిపెరగడం వల్ల కాబోలు అగ్ర కథానాయిక రష్మిక మందన్నలో కవితాత్మక భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు కావడంతో ఆమె సోషల్మీడియా పోస్ట్లు చక్కటి భావాల్ని వ్యక్తం చేస్తాయి. తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ‘కళ్లలో ఇంద్రజాలం…హృదయంలో వెలుగుధారలు’ అంటూ తన ఫోటో గురించి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తారాపథంలో దూసుకుపోతున్న కెరీర్, బహుభాషల్లో వస్తున్న అవకాశాలతో ఆనందోత్సాహంలో ఉన్న ఈ సుందరి తన మనోస్థితిని ప్రతిఫలించేలా ఆ మాటలు చెప్పిందంటున్నారు. కన్నడనాట నుంచి జాతీయ తారగా ఎదగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు సైతం కామెంట్ల రూపంలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ‘మిషన్ ముజ్ను’ ‘గుడ్బై’ సినిమాలు చేస్తున్నది. వీటితో పాటు పలు భారీ ప్రాజెక్ట్స్లో కథానాయికగా ఈ ముద్దుగుమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.