హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మ్యూకోర్మైకాసిస్ (బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే లిపోసోమల్ అంపోటెరిసెన్ బీ ఇంజెక్షన్ను ప్రభుత్వ కమిటీ అనుమతి తీసుకున్నాకే సరఫరాచేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిట్రేషన్ (డీసీఏ) తెలంగాణ స్పష్టంచేసింది. ఈ మేరకు తయారీదారులు, సీఎఫ్ఏ, స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్లకు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కొవిడ్ నుంచి కోలుకున్నాక బ్లాక్ఫంగస్ వ్యాధి బారిన పడుతున్నవారికి లిపోసోమల్ అంపోటెరిసెన్ బీ ఇంజెక్షన్ను అందుబాటులో ఉంచేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. ఈ ఇంజెక్షన్ తయారీ కంపెనీలు నేరుగా స్టాకిస్టులకు మాత్రమే సరఫరాచేయాలని, ఎంత క్వాంటిటీ డ్రగ్ సరఫరా చేశారు? ఏ స్టాకిస్ట్కు ఇచ్చామో వారి పేరు, చిరునామా తదితర వివరాలన్నింటినీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు అందించాలని సూచించింది. ప్రభుత్వ కమిటీ సూచించిన మోతాదులోనే డ్రగ్ను స్టాకిస్టులకు ఇవ్వాలని, కమిటీ ముందస్తు అనుమతి లేకుండా స్టాకిస్టులు సింగిల్ వాయిల్ కూడా దవాఖానలకు, రోగులకు నేరుగా ఇవ్వకూడదని స్పష్టంచేసింది. దీన్ని అతిక్రమిస్తే కఠినంగా పరిగణిస్తామని హెచ్చరించింది.