కెరీర్లో ఉన్నతి కోసం వ్యక్తిగత జీవితాన్ని ఎంతగానో త్యాగం చేస్తున్నానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఒక్కచోట స్థిరంగా ఉండటం కుదరటం లేదని..కుటుంబాన్ని, స్నేహితుల్ని మిస్ అవుతున్నానని తెలిపింది. అయితే ఈ పరుగును తానెంతగానో ఆస్వాదిస్తున్నానని, కోరుకున్న గమ్యంవైపు పయనిస్తున్నాననే సంతృప్తి ఉందని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ప్రస్తుతం నేను తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్నా. కెరీర్ నేను కోరుకున్న విధంగా సాగిపోతోంది. భాషా పరంగా ఎలాంటి హద్దుల్ని విధించుకోలేదు. ఆర్టిస్టులెవరైనా వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాలి. నా మనస్సాక్షి మేరకే సినిమాల్ని ఎంచుకుంటున్నా. ఎలాంటి పాత్ర చేసినా దానికి పరిపూర్ణంగా న్యాయం చేయాలన్నదే నా సిద్ధాంతం’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.