తెలుగు చిత్రసీమలో రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అపజయమే లేకుండా కెరీర్లో దూసుకుపోతున్న ఈ సొగసరి అనతికాలంలోనే నంబర్వన్ హోదాను సొంతం చేసుకున్నది. ఈ ఏడాది బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న ఆమె మూడు సినిమాలను అంగీకరించింది. అరడజనకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె ఓ తెలుగు సినిమాలో అతిథి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ వార్ డ్రామా కథాంశంతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇండియా-పాకిస్థాన్ మధ్య 1964-65లో జరిగిన యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతిథి పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నట్లు తెలిసింది. కథాగమనంలో కీలకంగా ఉంటూ నటనకు ప్రాముఖ్యమున్న పాత్ర కావడంతో రష్మిక మందన్న ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందని చెబుతున్నారు. త్వరలో రష్యాలో ప్రారంభమయ్యే షెడ్యూల్లో ఆమె పాల్గొననున్నట్లు సమాచారం. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంకదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.