సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టడం తనలో నూతనోత్తేజాన్ని నింపిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ కన్నడ వయ్యారి తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో బిజీగా ఉంది. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ చిత్రాల్లో నటిస్తోంది. అమితాబ్బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుడ్బై’ చిత్రీకరణ ఇటీవలే ముంబయిలో పునఃప్రారంభమైంది. ఈ షూటింగ్లో రష్మిక మందన్న పాల్గొంటున్నది. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. ‘చాలా రోజుల తర్వాత సెట్స్లోకి అడుగుపెట్టడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. యూనిట్ సభ్యులందరిని ప్రేమపూర్వకంగా పలకరించి యోగక్షేమాల్ని తెలుసుకోవడం గొప్ప సంతృప్తినిచ్చింది. ఆరా (పెంపుడు శునకం) కూడా సెట్స్లో నాతో సందడి చేయడంతో ఆనందం రెట్టింపైంది. షూటింగ్ ముగిసిన అనంతరం నా రెగ్యులర్ వర్కవుట్స్తో సేదతీరాను. చాలా విరామం తర్వాత ఓ రోజంతా సంతోషంగా గడిపాను’ అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది.