వనస్థలిపురం, మార్చి 11 : కట్టుకున్న భర్తను భార్యే చంపి పాతిపెట్టిన ఘటనకు కేంద్రమైన ఆ ఇంటివైపు చూడాలంటేనే స్థానికులు ఉలిక్కి పడుతున్నారు. పదిహేనేండ్లుగా ఆ ఇల్లు ఖాళీగా ఉందని, విషాదాలకు నిలయంగా మారిందని చర్చించుకుంటున్నారు. భర్తను హత్యచేసి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మృతు డు గగన్, నిందితురాలు నౌసిన్ నివాసముండే బంగళా అంటే ఆ ప్రాంతంలో హడల్. స్థానికులు దానిని భూత్ బంగ్లా.. అని పిలుస్తున్నారు. గగన్ అగర్వాల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ పదేండ్ల కిందట ఆ బంగ్లాను కొనుగోలు చేశాడు. కొన్ని రోజులకే ఇంట్లో గొడవలతో గగన్ తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారు భవనాన్ని వదిలి మరోచోటకు వెళ్లారు. ఆ తర్వాత మరొకరికి అద్దెకు ఇవ్వగా ఆ కుటుంబంలో కూడా ఒకరు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ భవనంలో ఉండేందుకు కాని, కొనేందుకు కానీ ఎవరూ రాకపోవడంతో 15ఏండ్లుగా ఖాళీగానే ఉంది. ముందు నుంచి గంభీరంగా కనిపించే ఈ బంగ్లావైపు రాత్రిపూట వెళ్లాలంటే స్థానికులు భయపడేవారు. గగన్, నౌసిన్ల వివాహం తర్వాత బంగ్లా ముందువైపున రంగులు వేయించి కాపురం పెట్టారు. ఇప్పుడు ఈ హత్య ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది.
నిందితురాలికి రిమాండ్… పలు కోణాల్లో దర్యాప్తు
భర్తను హత్యచేసిన నౌసిన్ బేగంను బుధవారమే అరెస్టు చేసిన పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఆమెకు సహకరించిన మృతుడి స్నేహితుడు సునీల్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి మరికొంతమంది సహకరించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన బిడ్డలను వేధించినందుకే హత్యచేసినట్లు నిందితురాలు చెబుతున్నా, ఆస్తికోసం కూడా చేసి ఉండవచ్చన్న అనుమానాలు స్థానికంగా వెలువడుతున్నాయి. వారి ఇంట్లో తరచూ పార్టీలు జరుగుతుండేవని, హత్య జరిగిన ఫిబ్రవరి 6న స్నేహితుడు సునీల్తో కలిసి మద్యం సేవించి ఉన్న గగన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు వాడిన కత్తి ఎక్కడిదనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులు కూడా ఈ కేసు పురోగతి విషయంలో గోప్యత పాటించడం గమనార్హం.