ఓటీటీ వేదికలు కథానాయికలకు ఓ వరంగా మారాయని చెప్పింది రాశీఖన్నా. సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంచుకోవడానికి, ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో భాగంకావడానికి డిజిటల్ ప్లాట్ఫామ్స్కు మించిన మార్గం లేదని వివరించింది. ఓపికతో ఎదురుచూస్తే మనసుకు నచ్చిన పాత్రలు వరిస్తాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సుందరి హిందీ వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న ఓ వెబ్సిరీస్లో షాహిద్కపూర్ సరసన నటిస్తున్నది. అజయ్దేవ్గణ్తో కలిసి ‘రుద్ర’ అనే సిరీస్లో కీలక పాత్రను పోషిస్తున్నది. ‘రుద్ర’ సిరీస్లో ఎంపిక చేసేముందు తాను ఆడిషన్స్లో పాల్గొన్నానని, సీనియర్ నాయికను అయినప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా ఆడిషన్స్లో భాగమయ్యానని రాశీఖన్నా చెప్పింది. ఆడిషన్స్ ద్వారా ఎంపిక కావడం నటీనటుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తుందని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘సాధారణంగా సీనియర్ నటులు ఆడిషన్స్కు దూరంగా ఉంటారు. ఆ పద్దతి మంచిదికాదని నా అభిప్రాయం. ఆడిషన్స్లో నెగ్గి అవకాశం సొంతం చేసుకుంటే అంకితభావంతో పనిచేస్తాం. ప్రస్తుతం స్టార్డమ్ అనే పదానికి రోజులు చెల్లిపోతున్నాయి. ప్రతి సినిమాకు ఉత్తమ ప్రతిభ కనబరిస్తేనే ఇండస్ట్రీలో ముందుకుసాగుతాం’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ అనే చిత్రాల్లో నటిస్తున్నది.