మక్తల్ పీఏసీసీఎస్ పరిధిలో 79 వేల క్వింటాళ్ల ఖరీదు
కల్లాల వద్దనే ధాన్యం బస్తాల తూకాలు
ఆనందంలో అన్నదాతలు
మక్తల్రూరల్, జూన్ 7: ధాన్యం కొనుగోళ్లలో మక్తల్ పీఏసీసీఎస్ మరో రికార్డును సృష్టించింది. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణను అప్పగించింది. ఈమేరకు మక్తల్ సొసైటీ ద్వారా రైతుల వద్ద నుంచి యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. ఇంతవరకు పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో 79వేల 400 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది యాసంగి సీజన్లో జూన్ నెలాఖరు వరకు 70,400 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు పీఏసీసీఎస్ కార్యదర్శి రాములు సోమవారం ‘నమస్తే తెలంగాణాకు’ తెలిపారు. ఇదిలావుండగా గతంలో ధాన్యం కొనుగోలు చేయడానికి సరైన మార్కెటింగ్ లేకపోవడం, వ్యాపారులు రైతులకు సరైన ధర ఇవ్వకపోవడం వల్ల మధ్య దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో దళారులు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి నెలల తరబడి తమ చుట్టూ తిరిగేలా వ్యవహరించేవారు.
కొంత మంది దళారులు రైతుల వద్ద ధాన్యం కొలుగోలు చేసి డబ్బులు ఇవ్వడానికి ముఖం చాటేసేవారు. కొందరు ఏకంగా లక్షల్లో డబ్బులు ఇవ్వకుండా ఉడాయించిన సంఘటనలు సైతం మక్తల్ ప్రాంతంలో గతంలో లేకపోలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఇబ్బందులను గమనించి ధాన్యం అమ్మడానికి రైతులు ఎక్కడా ఇబ్బందులుపడరాదనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్శాఖను, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మండలంలో మక్తల్, మంథన్గోడ్, పస్పుల, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇదివరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారమని, ట్రాన్స్పోర్టు చార్జీల భారం పడి వ్యయప్రయాసాలకు గురయ్యేవారమని పలువురు రైతులు తెలిపారు. తమ గ్రామాల్లోనే కొనుగోలు కేంధ్రాలు పెట్టడం వల్ల తమ ఇబ్బందులు తీరాయని వారు సంతోషం వ్యక్తం చేశారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు
మక్తల్ పీఏసీసీఎస్ పరిధిలో సింగిల్ విండో సొసైటీ ద్వారా మండలంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారు. మక్తల్, పస్పుల, మంథన్గోడ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో రైతుల వద్ద నుంచి నేరుగా లక్షా 98 వేల బస్తాలు మొత్తం 79 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు.‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.1,888 ధర ప్రభుత్వం కల్పిస్తున్నది. మండలంలో ఇంతవరకు మొత్తం 890 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. రైతులకు 15 రోజుల్లో డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.