ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రణస్థలి’. పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ సూరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 26న విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తున్నది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన నిర్మాత సి.అశ్వనీదత్ మాట్లాడుతూ ‘నాకు గురుతుల్యులు విజయ్ పిక్చర్స్ అధినేత వెంటకరత్నంగారి అబ్బాయి విష్ణు ఈ సినిమా ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్, టీజర్లోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ‘ఇంద్ర’ చిత్రం గుర్తుకు వచ్చింది’ అన్నారు. వినూత్నమైన కాన్సెప్ట్తో వాణిజ్య అంశాల కలబోసి ఈ సినిమాను రూపొందించామని, నటీనటులందరూ కొత్తవారైనా అద్భుతమైన అభినయాన్ని కనబరిచారని నిర్మాతలు విష్ణు, జ్యోతి తెలిపారు. రొటీన్ కథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు పరశురాం చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జాస్తి బాలాజీ, సంగీతం: కేశవ్ కిరణ్, సమర్పణ: సూరెడ్డి విష్ణుగారి, నిర్మాణ సంస్థ: ఏజే ప్రొడక్షన్స్, దర్శకత్వం: పరశురాం శ్రీనివాస్.