హైదరాబాద్: తెలంగాణ భీం ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్ పోలీసులను తప్పుదారి పట్టించారు. నిన్నరాత్రి ఖైరతాబాద్ చౌరస్తాలో గుర్తుతెలియని వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని సుజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో వచ్చిన దుండగులు తనపై కత్తులతో దాడిచేసి పరారైనట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఖైరతాబాద్ చౌరస్తాలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో సుజిత్పై ఎలాంటి దాడి జరగలేదని తేల్చారు. అతను వెళ్తున్న బైకు అదుపుతప్పడంతో గ్రిల్స్పై పడినట్లు గుర్తించారు. కావాలనే తమను తప్పుదారి పట్టించినట్లు నిర్ధారణకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన సుజిత్ రావణ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.