హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. రెండు వారాల క్రితం వరకు రోజు 60 వేల పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1.20 లక్షలకు పెంచింది. త్వరలో 1.50 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 11 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించింది. వీరిలో 3.32లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, 80.8శాతం మందిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదు. వైరస్ సోకిన వారిని ముందుగా గుర్తించడం వల్ల వారిని ప్రమాదం నుంచి కాపాడటంతోపాటు, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యమవుతుంది. దీంతో ప్రభుత్వం ఆర్టీపీసీఆర్కు తోడు, ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నది. 20 ప్రభుత్వ, 60 ప్రైవేటు దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతుండగా, 1,064 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న 30 శాతం దాకా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఉండగా, ఈ సంఖ్యను 50శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అన్ని జిల్లా దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు.