ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన డీ-కంపెనీ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తున్నది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర నేపథ్యంగా రాంగోపాల్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. తన కలల ప్రాజెక్టుగా ఆయన పేర్కొన్నారు. నిర్దేశించిన షేడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీన డీ-కంపెనీ సినిమా విడుదల కావాల్సి ఉన్నది.
కానీ డీ-కంపెనీ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లాయిస్ సంబంధిత అధికార వర్గాలకు లేఖ రాసినట్లు తెలియవచ్చింది. దక్షిణాది సినిమా పరిశ్రమకు రూ.24 కోట్ల మేరకు రాం గోపాల్ వర్మ బకాయి పడినట్లు విమర్శలు ఉన్నాయి.
మూడేండ్ల క్రితం 2018లో నిర్మించిన ఆఫీసర్ సినిమాకు సంబంధించి ఆయన సినిమా రంగానికి చెందిన వివిధ వర్గాలకు బకాయి పడినట్లు తెలియవచ్చింది. కానీ. దేశంలో కరోనా కేసులు పెరిగినందు వల్లే ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు రాంగోపాల్ వర్మ తెలిపారు. అయితే, తమ బకాయిలు చెల్లించమని అడిగినప్పుడల్లా సినిమాలను విడుదల చేయడం ఆయన వాయిదా వేస్తారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లాయిస్ వర్గాలు ఆరోపించాయి.