మోమిన్పేట, మార్చి 20 : కేసారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు ఆదేశించారు. శనివారం మోమిన్పేట మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 28 వైకుంఠధామాలు మంజూరు కాగా, 15 పూర్తి అయ్యాయని, మిగితా వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని చెప్పారు. వీటిని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులు, సర్పంచులను ఆదేశించారు. కేసారం గ్రామంలో అవసరమైన ఇటుక, ఇసుక ఇతర నిర్మాణ సామగ్రి డంప్ చేసి స్లాబ్ పనులు పూర్తి చేయాలన్నారు. మోమిన్పేటలో వెజిటేబుల్ నర్సరీని సందర్శించారు. టమాట, మిర్చి నారును పరిశీలించి వాడుతున్న ఎరువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ నిర్వహణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు సంబంధించి తూకం, రకాలకు రసీదు వెంటనే అందించాలని సూచించారు. 80 మంది రైతులకు చెందిన 26 ఎకరాల్లో అవసరమైన విత్తనాలు అందించడానికి విత్తన కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. కంపెనీకి రెండు తూకం యంత్రాలు, 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఒక ట్రాలీ ఆటోను బ్యాంక్ రుణం ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. ట్రాలీతో పాటు ఒక డ్రైవర్ను కంపెనీ సభ్యుల కుటుంబం నుంచి వెంటనే నియమించాలన్నారు. కంపెనీలో పెద్ద రైతులు కూడా సభ్యులుగా చేరడానికి సభ్యుత్వం కల్పించాలని తెలిపారు. ఏప్రిల్ మాసంలో కంపెనీ లెక్కలు ఆడిట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో కృష్ణన్, ఏపీడీ నర్సింహులు, డీపీఎం శ్రీనివాస్, సీసీలు, ఏఈ/పీఆర్ ప్రణీత్, కేసారం సర్పంచ్ చంద్రకళ పాల్గొన్నారు.