హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): బీఈడీ కోర్సులో పలు మార్పులుచేస్తూ విద్యాశాఖ స్పెషల్సీఎస్ చిత్రారామచంద్రన్ సోమవారం జీవో-14 జారీచేశారు. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీవారితో పాటు బీబీఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు కూడా బీఈడీ కోర్సుల్లో చేరవచ్చని జీవో పేర్కొన్నారు. వీరు డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ విద్యార్థులు ఎడ్సెట్ రాసేందుకు ఇప్పటివరకు 55 శాతం మార్కులు అర్హతగా ఉండగా, తాజాగా 50 శాతానికి తగ్గించారు. డిగ్రీలో కేవలం కెమిస్ట్రీ సబ్జెక్టు ఒక్కటే చదివినా బీఈడీ ఫిజికల్ సైన్స్ మెథడ్లో చేరేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ప్రవేశపరీక్షలో ఇప్పటివరకు మెథడ్స్ విధానాన్ని రద్దుచేసి అందరికీ ఒకే కామన్పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రవేశపరీక్షలో మెథడ్స్ లేకపోయినా బీఈడీ ప్రవేశాలు మాత్రం మెథడ్స్ ఆధారంగానే జరుగుతాయని వెల్లడించారు. వారంలోగా బీఈడీ నోటిఫికేషన్ విడుదలచేసి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రతి వంద బీఈడీ సీట్లలో గణితానికి 25 శాతం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం మెథడ్స్కు కలిపి 30 శాతం సీట్లు కేటాయించారు. సోషల్ సైన్స్కు 45 శాతం సీట్లను కేటాయించారు. దీంట్లో ఇంగ్లిష్, ఓరియంటల్ లాంగ్వేజెస్ వారికి 15 శాతం సీట్లుకు మించకుండా ప్రవేశాలు కల్పిస్తారు.
ఫొటో, సంతకం సరిచేసుకోండి: ఇంటర్బోర్డు
ఇంటర్ హాల్టికెట్లలో ఫొటో, సంతకం తప్పుగా పడినవారు 20లోపు సవరించుకోవచ్చని ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు. పొరపాట్లను సవరించేందుకు వీలుగా వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు రీ అప్లోడ్ ది కరెక్ట్ ఫొటో అండ్ సిగ్నేచర్ ఆప్షన్ను ఎంచుకొని తప్పులను సవరించుకోవచ్చని సూచించారు.
ఇవీ కూడా చదవండి…
2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ, శ్వేత జాతేతర వ్యక్తి
ఆంగ్ సాన్ సూకీపై కొత్త క్రిమినల్ కేసు నమోదు