మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆయన కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చేసి ఎందరో మనసులు గెలుచుకున్నారు.ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్తో ప్రజలకు సేవ చేస్తోన్న చిరంజీవి… వెబ్ సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ చరణ్ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ… ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్ లో ఉన్న సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులో ఉన్న నిల్వల గురించి తెలుసుకొని సాయం పొందొచ్చు. డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వెయిట్ చేయనవసరం లేదు. సైట్ లో మీరు ఏ టైంలో ఏ రోజు రావాలనుకుంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు.
ఎవరికైనా రక్త దానం, నేత్ర దానం కావాలన్నా ఇందులో రిక్వెస్ట్ పెడితే మేము త్వరగా రెస్పాండ్ అవుతాము. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంక్ మాత్రమే ఉంది. త్వరలో మిగిలిన అన్ని ఆర్గాన్స్ కి డొనేట్ చేసేలాగా అవయవ దానం కూడా మొదలు పెడతాము అని తెలిపారు. అంతే కాక మన ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో ఈ వెబ్ సైట్ లభ్యమవుతుంది. దేశమంతటా కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్స్ బ్రాంచ్ లు పెట్టె దిశగా ఆలోచిస్తున్నాము అని అన్నారు.
ఇక చిరంజీవి పర్సనల్ వెబ్ సైట్ లాంచ్ చేయగా, ఇందులో చిరంజీవి ఇప్పటిదాకా నటించిన సినిమాల వివరాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, చిరంజీవి సినిమాల్లోని పాటలు, చిరంజీవి ఫోటోలు, చిరంజీవి చేసిన కార్యక్రమాలు, ఆయనకి వచ్చిన అవార్డులు, రివార్డులు అన్ని కూడా లభ్యమవుతాయి. అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ సైట్ ని రూపొందించినట్టు తెలిపారు.