ముంబై: మహారాష్ట్రలోని పూణేలో కరోనా తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి 12 గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారం రోజుల పాటు 12 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పూణే డివిజనల్ కమిషనర్ సౌరభరావు శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వారం రోజులు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయని, సిటీ బస్సులు కూడా నడవవని తెలిపారు. హోమ్ డెలివరీని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.
వివాహాలు, అంత్యక్రియలు మినహా ఎలాంటి బహిరంగ వేడుకలను అనుమతించబోమన్నారు. వివాహాలకు గరిష్ఠంగా 50 మంది, అంత్యక్రియలకు 20 మంది పరిమితి విధించినట్లు తెలిపారు. ఈ ఆంక్షలు, నిబంధనలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని అన్నారు. వచ్చే శుక్రవారం పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
పూణేలో బుధవారం 8,605, గురువారం 8,011 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.