కొణిదెల శివ శంకర వరప్రసాద్… ఈ పేరు అందరికి తెలియకపోవచ్చు కాని, చిరంజీవి అంటే మాత్రం ప్రపంచం గుర్తు పడుతుంది. ఆగస్ట్ 22న జన్మించిన చిరు సెప్టెంబర్ 22న నటుడిగా ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినా ముందుగా ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. 1978 సెప్టెంబరు 22న ఈ సినిమా విడుదలైంది.
నిన్నటితో చిరు నటించిన తొలి చిత్రం 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి..తనపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తోన్న అభిమానులకి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఆగస్టు 22 నేను పుట్టిన రోజైతే, సెప్టెంబరు 22.. నటుడిగా పుట్టినరోజు. కళామ్మతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. నటుడిగా పరిచయమై మీ అందరి ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేనిరోజు. దీనికి కారణమైన నా సోదరసోదరీమణులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అలానే తన మొదటి సినిమా పునాది రాళ్లు నాటి టైం ఫోటోని కూడా తన సోషల్ మీడియా డీపీ గా పెట్టుకున్నారు.
చిరు సినీ ప్రస్థానంపై రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ’43 ఏళ్ల సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది.. మా నాన్న’ అంటూ తన తండ్రి మొదటి సినిమా నాటి ఫోటో ఇప్పుడు చేస్తున్న ఆచార్య సినిమా ఫోటోని జత చేసి షేర్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ పోస్ట్ వైరల్గా మారింది. చిరు .. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చిత్రాల్లో నటిస్తున్నారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించారు.